Tragedy in Nandyala district
Nandyal District : నంద్యాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. వీరిలో భార్యభర్తలతో సహా ఇద్దరు పిల్లలు ఉన్నారు. జిల్లాలోని చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో మట్టి మిద్దె కూలిన ఘటనలో వీరు మరణించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి మృతదేహాలను గ్రామస్తులు వెలికితీశారు. మృతులు గురుశేఖర్ రెడ్డి (45), దస్తగిరమ్మ (38) దంపతులు కాగా.. వారి ఇద్దరు కుమార్తెలు పవిత్ర (16), గురులక్ష్మి(10)గా గుర్తించారు. వీరికి మరో కుమార్తె ఉంది. కడప జిల్లా ప్రొద్దుటూరు ఉషోదయ పాఠశాలలో ఆమె చదువుతోంది.
Also Read : Raj Tarun: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హీరో రాజ్ తరుణ్
వీరంతా ఇంట్లో నిద్రిస్తుండగా అర్థరాత్రి సమయంలో మట్టి మిద్దె కూలింది. శుక్రవారం తెల్లవారు జామున స్థానికులు గమనించి శిథిలాలను తొలిగించి చూడగా అప్పటికే నలుగురు కన్నుమూశారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.