Ammavodi Laptop : నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు తీసుకొచ్చింది. అందులో అమ్మఒడి ఒకటి. 1 నుంచి 12వ తరగతి (ఇంటర్) విద్యార్థుల కోసం ఈ స్కీమ్ తెచ్చారు. ఈ స్కీమ్ కింద అర్హులైన తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేలు జమ చేస్తోంది ప్రభుత్వం. కాగా, ఈ పథకంలో కీలక మార్పులు చేసింది జగన్ సర్కార్. 2021-22 విద్యా సంవత్సరం నుంచి 9 నుంచి 12వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులకు నగదు బదులు ల్యాప్ టాప్ లను అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. దీనికి సంబంధించిన కసరత్తును ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. కాగా, అమ్మఒడి పథకం ద్వారా నగదు కావాలో.. లేదంటే ల్యాప్టాప్ కావాలో తేల్చుకునే అవకాశాన్ని తల్లుల అభీష్టానికే వదిలేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
* ఈ మేరకు సీఎం జగన్ సందేశంతో కూడిన అంగీకార పత్రాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు ఏప్రిల్ 15నాటికి అన్ని స్కూళ్లు, కాలేజీలకు అందించాలి.
* ఏప్రిల్ 19వ తేదీన 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి పత్రాలను ఇస్తారు.
* ఆ అంగీకార పత్రాలను విద్యార్థులు ఇంటికి తీసుకెళ్లాలి. డబ్బు కావాలా? లేక ల్యాప్ టాప్ కావాలా..? అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తల్లి లేదా సంరక్షకులతో సంతకం చేయించి తిరిగి ఏప్రిల్ 22నాటికి ఆ లేఖలను స్కూళ్లు, కాలేజీల్లో అందించాలి.
* ఈ నెల 26వ తేదీ నాటికి తల్లిదండ్రులు ఎంపిక చేసుకున్న ఆప్షన్ కు సంబంధించిన వివరాలను అమ్మఒడి వెబ్ సైట్ లో పొందుపరుస్తారు.
* వెబ్ సైట్ లో వచ్చిన వివరాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ల్యాప్ టాప్ లు అవసరమో లెక్కించి.. ప్రముఖ కంపెనీలకు ఆర్డర్ ఇస్తుంది.
* ఈ పథకం ద్వారా రూ.27వేల విలువ చేసే బ్రాండెడ్ ల్యాప్ టాప్ ను కేవలం రూ.18వేల 500కే అందిస్తుంది.