Visakha Railway Zone: సై అంటే సై.. విశాఖ రైల్వే జోన్‌ చుట్టూ రాజకీయ రచ్చ ఎందుకు..? వైసీపీ పోరాటం దేనికి?

సీఎం చంద్రబాబు అసమర్ధత వల్లే కేకే లైన్‌, అర‌కు కోరాపుట్ లేని రైల్వేజోన్ విశాఖకు దక్కిందని మండిపడుతోంది వైసీపీ. ఈ తరహా విశాఖ రైల్వేజోన్ రాష్ట్రానికి భారమే తప్ప మరొకటి కాదంటున్నారు ప్రతిపక్ష నేతలు.

  • Updated on- May 6, 2026 / 09:08 PM IST
  • విశాఖ రైల్వే జోన్‌పై ఎవరి లొల్లి వారిదే..
  • రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్
  • కేకే లైన్‌ను తీసేసి జోన్ ఇచ్చారంటూ వైసీపీ గుస్సా
  • పోరాటాల వల్లే రైల్వేజోన్ వచ్చిందంటున్న వామపక్షాలు
  • బాబు కృషి వల్లే కేంద్రం జోన్ ఇచ్చిందంటున్న తమ్ముళ్లు

Visakha Railway Zone: దశాబ్దాల కల నెరవేరింది. ఎట్టకేలకు విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుకు కేంద్రం గెజిట్‌ ఇచ్చింది. జూన్‌ ఫస్ట్ నుంచి విశాఖ కేంద్రంగా యాక్టివిటీ స్టార్ట్‌ కానుంది. అయితే రైల్వే జోన్‌ చుట్టూ ఇప్పుడు రాజకీయ రచ్చ నడుస్తోంది. కేకే లైన్‌ లేకుండా జోన్ ఎందుకు అంటూ పోరాటానికి సై అంటోంది వైసీపీ. ఇటు ప్రజా పోరాటాల వల్లే జోన్ వచ్చిందని వామపక్ష పార్టీలు చెప్పుకుంటుంటే..చంద్రబాబు కృషి వల్లే కేంద్రం జోన్ ఏర్పాటునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో ఉత్తరాంధ్ర వేదికగా రైల్వే జోన్‌ సెంట్రిక్‌గా పొలిటికల్ ఫైట్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఏపీ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ జూన్‌ ఫస్ట్ నుంచి స్టార్ట్ కానుంది. ఇప్పుడున్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో పాటు విశాఖ డివిజన్‌ను కలిపి కొత్త రైల్వే జోన్ పని చేయనుంది. దక్షిణ కోస్తా జోన్‌ పేరుతో ఏర్పాటైన ఈ రైల్వే జోన్‌ కోసం ఉత్తరాంధ్ర ప్రజలు రాజకీయాలకు అతీతంగా సుదీర్ఘ పోరాటం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక రైల్వే జోన్‌ లేకుండానే ఇన్నాళ్లూ ఏపీలో రైల్వే యాక్టివిటీ నడిచింది.

రైల్వే జోన్‌ పనులు అడ్డుకున్న వైసీపీ?

ప్రధాని నరేంద్ర మోదీ 2019 ఎన్నికల ప్రచారంలో విశాఖపట్నం వచ్చినపుడు రైల్వే జోన్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని హామీ అమలు కావడానికి ఏడేళ్ల సమయం పట్టింది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ప్రకటించిన తర్వాత ప్రధాన కార్యాలయం నిర్మాణానికి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం రూ.150 కోట్ల వరకు మంజూరు చేసింది. అయితే అవసరమైన భూముల కేటాయింపులో నాటి వైసీపీ ప్రభుత్వం జాప్యం చేసిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఒక విధంగా రైల్వే జోన్‌ పనులను ముందుకు వెళ్లకుండా వైసీపీ అడ్డుకుందనే వాదన వినిపిస్తోంది.

చ‌నిపోయిన బిడ్డను చేతిలో పెట్టిన‌ట్టుగా ఉంద‌ని వైసీపీ విమర్శలు..

అయితే విశాఖ రైల్వే జోన్ క్రెడిట్ సీఎం చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వానిదే అంటూ టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటుండగా..వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కొత్తవ‌ల‌స‌-కిరండూల్‌ లైన్ లేకుండా విశాఖ రైల్వేజోన్ ప్రక‌టించి తీవ్ర అన్యాయం చేశారని అంటోంది వైసీపీ. కేకే లైన్‌ లేకుండా విశాఖ రైల్వే జోన్ ఇచ్చి లాభమేంటి అంటూ ప్రశ్నిస్తోంది. కేకే లైన్‌ను మినహాయించి రైల్వే జోన్ ఇవ్వడమంటే..చ‌నిపోయిన బిడ్డను చేతిలో పెట్టిన‌ట్టుగా ఉంద‌ని విమర్శిస్తోంది. సీఎం చంద్రబాబు అసమర్ధత వల్లే కేకే లైన్‌, అర‌కు కోరాపుట్ లేని రైల్వేజోన్ విశాఖకు దక్కిందని మండిపడుతోంది వైసీపీ. ఈ తరహా విశాఖ రైల్వేజోన్ రాష్ట్రానికి భారమే తప్ప మరొకటి కాదంటున్నారు ప్రతిపక్ష నేతలు.

కేకే లైన్‌తో కూడిన విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అంటోంది వైసీపీ. కేకే లైన్, అర‌కు, కోరాపూట్ వంటి టూరిజం ప్రాంతాలు లేకుండా కేంద్రం ప్రక‌టించిన రైల్వేజోన్ ఏపీకి గుదిబండ‌గా మారుతుంద‌నే వాదన వినిపిస్తున్నారు. 446 కిలోమీటర్ల పొడ‌వున్న ఉన్న కేకే లైన్ ఐర‌న్ ఓర్‌, మాంగ‌నీస్, బాక్సైట్ ట్రాన్స్‌పోర్ట్‌కు ప్రధాన మార్గమే కాదు..విశాఖ రైల్వే జోన్‌కు అతిపెద్ద ఆదాయ వ‌న‌రు అన్న విషయాన్ని మర్చిపోతుయారని ఫైర్ అవుతున్నారు వైసీపీ లీడర్లు. ఇక ప్రజా పోరాటాల ఫలితమే రైల్వే జోన్ అంటున్న వామపక్షాలు..కేకే లైన్‌ విషయంలో వైసీపీ డిమాండ్‌నే వినిపిస్తున్నాయి.

రాజకీయ లబ్ధి కోసమే జగన్ అండ్ కో విమర్శలు..!

ప్రతిపక్ష వైసీపీ వాదనపై..టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. విశాఖపట్నం రైల్వేజోన్ విషయంలో వైసీపీ క్రెడిట్ చోరీకి పాల్పడుతోందని…రాజకీయ లబ్ధి కోసమే జగన్ అండ్ కో లేనిపోని విమర్శలు చేస్తున్నారని రివర్స్ అటాక్ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. 2019 నుంచి ఐదేళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ప్రత్యేక రైల్వే జోన్‌ను సాధించలేకపోయారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వల్లే రైల్వేజోన్ వచ్చిందన్న విషయం అందరికీ తెలుసు అంటున్న తెలుగు తమ్ముళ్లు..విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ కావాలన్న ఉత్తరాంధ్ర ప్రజల కల ఫలించిందని చెప్తున్నారు.

కేంద్రంలో ఎన్డీయే భాగస్వామిగా ఉంది టీడీపీ. పైగా రాష్ట్రంలో కూటమి సర్కార్ ఉంది. ఈ ఈక్వేషన్స్ నేపథ్యంలోనే రైల్వే జోన్ సాధ్యమైందన్నది కూటమి నేతల వాదన. కేంద్రం అలా రైల్వే జోన్‌పై గెజిట్ రిలీజ్ చేసిందో లేదో..ఇలా పొలిటికల్ ఫైట్ స్టార్ట్ అయింది. విశాఖ కేంద్రం ఉత్తరాంధ్ర లీడర్లు..ఎవరి వాదన వాళ్లు వినిపిస్తున్నారు. ప్రజల చిరకాట కోరిక నెరవేరింది సరే కానీ..రైల్వే జోన్‌ చుట్టూ కొనసాగుతున్న రాజకీయ యుద్ధం ఎటు దారితీస్తుందో చూడాలి.

Also Read: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు.. రూ.4 కోట్లతో నిర్మాణాలు