దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం.. నలిగిపోతున్న టెక్కలి వైసీపీ నేతలు..!

కార్యకర్తలకు అండగా ఉండాల్సిన నేతలు సొంత సమస్యలతో రోడ్డెక్కుతూ రచ్చ చేస్తుండటంపై ఆగ్రహం మీదున్నారు కేడర్.

Gossip Garage : వాణి.. మాధురి మధ్యలో దువ్వాడ శ్రీనివాస్. మొదట భార్యాభర్తల పంచాయితీ అనుకున్నారు. మాధురి ఎంట్రీతో.. పతి పత్ని ఔర్‌ ఏక్ లేడీ అన్నట్లుగా మారిపోయింది స్టోరీ. సీరియల్ ఎండింగ్‌లో.. ఒక్కొక్క ఎపిసోడ్‌లో ఒక్కో ట్విస్ట్ ఉన్నట్లు.. చర్చలు, ఆస్తుల పంపకాలు అంటూ హడావుడి నడిచింది. అయినా దువ్వాడ ఫ్యామిలీ స్టోరీ కొలిక్కి రాలేదు. 20 రోజులుగా భార్య వాణి, కూతుర్లు హైందవి, నవీనలు దువ్వాడ కొత్త ఇంటి కార్ షెడ్‌లోనే నిరసన తెలుపుతున్నారు. దువ్వాడ శ్రీను, వాణి ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. శ్రీను-వాణి కుటుంబ పెద్దలు చర్చలు జరిపినా కొలిక్కిరాలేదు. ఈ వివాదం కాస్త హైకోర్టుకు చేరింది.

సిక్కోలు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న దువ్వాడ శ్రీనివాస్ గెలుపోటములతో సంబంధం లేకుండా.. జగన్ మనస్సు గెలిచిన దువ్వాడ.. వైసీపీలో కీలక నేతగా ఎదిగారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడినా.. ఎమ్మెల్సీ పదవిచ్చి దువ్వాడను గౌరవించారు జగన్. శ్రీకాకుళం జిల్లా వైసీపీలో కీలక నేతగా ఉన్న దువ్వాడ శ్రీను.. ఇప్పుడు కుటుంబ వివాదంలో ఇరుక్కుని ..రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. దువ్వాడ ఇంటిపోరు టాక్‌ ఆఫ్‌ ది టూ స్టేట్స్‌గా మారిపోయింది.

దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి ..వైసీపీలో కీలక నేతలుగా ఉన్నారు. ఇద్దరూ టెక్కలి నియోజకవర్గానికి ఇంచార్జులుగా కూడా పనిచేశారు. మరోవైపు దువ్వాడ శ్రీను -వాణి వివాదం రెండేళ్లుగా నడుస్తూ వస్తుంది. చాలాసార్లు వీళ్లిద్దరి పంచాయతీ వైసీపీ అధిష్టానం దగ్గరకు వెళ్లినా..పార్టీ పెద్దలు, స్వయంగా వైసీపీ అధినేత జగన్ చెప్పినా పరిష్కారం లభించలేదు. ఇప్పుడు ఇంత రచ్చ జరుగుతున్నా జిల్లా వైసీపీలో కీలక నేతలుగా ఉన్న ధర్మాన సోదరులు గాని, తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు మౌనంగానే ఉంటున్నారు.

మాజీ మంత్రులు అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయి రెడ్డి వ్యవహారంలో కూడా వైసీపీ సైలెన్స్‌గానే ఉంది. ఇప్పుడు దువ్వాడ వాణి డిమాండ్ చేస్తున్నట్లు శ్రీనివాస్‌పై చర్యలు తీసుకుంటే పార్టీకి డ్యామేజ్‌తో పాటు.. బీసీ నేత కాబట్టి చర్యలు తీసుకున్నారన్న ప్రచారం ప్రజల్లోకి వెళ్తుందన్న ఆలోచనలో వైసీపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. శ్రీను, వాణి ఇద్దరు కీలక నేతలు కావడం ..ఇద్దరికి ఎవరి మాట వినే మనస్థత్వం లేకపోవడంతో పార్టీ నేతలు మాట్లాడినా పరిష్కారం లభించదని భావిస్తున్నారట. అందుకే కుటుంబ వివాదం కాస్త పార్టీకి అంటకుండా ఉంటే చాలని వైసీపీ అధిష్టానం అనుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంటి వివాదం వారే తెల్చుకోవాలని ఇందులో పార్టీ కలుగజేసుకోదంటున్నారట.

Also Read : వైఎస్ జగన్ సొంత జిల్లాలో పాగా వేయాలని సీఎం చంద్రబాబు స్కెచ్..!

మరోవైపు వాణి-శ్రీను-మాధురి వివాదంలో..టెక్కలి వైసీపీ నేతలు నలిగిపోతున్నారు. టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడు హవా నడుస్తోంది. ఇలాంటి సందర్భంలో పార్టీకి.. కార్యకర్తలకు అండగా ఉండాల్సిన నేతలు సొంత సమస్యలతో రోడ్డెక్కుతూ రచ్చ చేస్తుండటంపై ఆగ్రహం మీదున్నారు కేడర్. తమకు అండగా ఉండి నడిపించే నాయకులు లేరని మదనపడుతున్నారట. ఒకరి దగ్గరికి వెళ్తే మరొకరికి కోపం వస్తుందని.. ఆ ముగ్గురికి ఆమడ దూరంలో ఉండటమే బెటరని.. దువ్వాడ ఇంటి దరిదాపులకు కూడా వెళ్లడం లేదు వైసీపీ శ్రేణులు. ఈ నేపథ్యంలో దువ్వాడ ట్రైయాంగిల్ స్టోరీకి శుభం కార్డు ఎప్పుడు పడుతుందా అని అటు వైసీపీ పార్టీ పెద్దలు, అటు క్యాడర్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు