YCP candidate Gurumurthy : తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థిని ఖరారు చేశారు. డా.గురుమూర్తి పేరును సీఎం జగన్ ఖరారు చేశారు. గురుమూర్తి పేరును అధికారికంగా వైసీపీ ప్రకటించింది. ఈ మేరకు ఆయన పేరును ఫైనల్ చేసినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం (మార్చి 16, 2021) ప్రకటన విడుదల చేసింది.
ఏపీలోని తిరుపతి లోక్సభ, తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నె2ల 23న నోటిఫికేషన్ విడుదల కానుంది. 30వ తేదీన నామినేషన్లు స్వీకరిస్తారు. 31న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 17న పోలింగ్ నిర్వహిస్తారు. మే 2వ తేదీన ఫలితాలు విడుదలవుతాయి.
తిరుపతిలో సిట్టింగ్ వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. ఇప్పుడీ స్థానంలో తిరిగి ఎన్నిక కోసం ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. కరోనా కారణంగా ఇన్నాళ్లు నోటిఫికేషన్ జారీ ప్రక్రియ ఆలస్యం జరిగిందని తెలుస్తోంది.
మొదట ఈ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలన్న ఆలోచలు వచ్చినా.. బీజేపీ, టీడీపీ బరిలోకి దిగేందుకు ఉత్సాహంగా కనిపిస్తుండటంతో పోటీ అనివార్యమైంది. వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తి పేరును సీఎం జగన్ ఖరారు చేశారు.