Nandyala Heavy Rains : ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నంద్యాల జిల్లాలో కురుస్తున్న వర్షాలకు నల్లమల అటవీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి.
మూడు రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నల్లమల ఫారెస్ట్ తడిసి ముద్దైంది. నల్లమల ఘాట్ లో రాత్రి నుండి కురిసిన భారీ వర్షానికి గుంటూరు, కర్నూలు జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఉదయం వరకు ట్రాఫిక్ జామ్ అయింది.
ఐదు కిలో మీటర్ల వరకు భారీ ట్రాఫిక్ జామ్ అయింది. సెల్ ఫోన్ సిగ్నల్ లేకపోవడంతో పోలీసులకు ఆలస్యంగా సమాచారం అందింది. రహదారిపై కొండ చరియలు విరిగిపడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు కొండ చరియల తొలగింపు ప్రక్రియను చేపట్టారు. ఆత్మకూరు పోలీసులు రాత్రంతా శ్రమించి ఉదయానికి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.