Jagananna Vidya Deevena: నేడే జగనన్న విద్యాదీవెన.. నేరుగా తల్లి బ్యాంకు ఖాతాలోకే నగదు
జగనన్న విద్యాదీవెన’ పథకం కింద 2020–21 ఫీజు రీయింబర్స్మెంట్ మొదటి విడత నగదును రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అందించనుంది. మొదటి విడత కింద 10,88,439 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.671.45 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు.
- kunduru Vinod
- Published On : April 19, 2021 / 09:49 AM IST
Jagananna Vidya Deevena
Jagananna Vidya Deevena: ‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద 2020–21 ఫీజు రీయింబర్స్మెంట్ మొదటి విడత నగదును రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అందించనుంది. మొదటి విడత కింద 10,88,439 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.671.45 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ మేరకు ఆర్థిక శాఖతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలు రూ.671.45 కోట్లను విడుదల చేస్తూ ఆదివారం జీవోలు జారీ చేశాయి.
ఈ నిధుల్లో బీసీ సంక్షేమ శాఖ నుంచి రూ.491.42 కోట్లను విడుదల చేసింది. ఇందులో బీసీ విద్యార్థులతో పాటు ఈబీసీ, కాపు విద్యార్థులు ఉన్నారు. ఎస్సీ విద్యార్థుల కోసం ఎస్సీ సంక్షేమ శాఖ రూ. 119.25 కోట్లు, ఎస్టీ విద్యార్థుల కోసం ఎస్టీ సంక్షేమ శాఖ రూ.19.10 కోట్లు, మైనారిటీ సంక్షేమ శాఖ రూ.41.68 కోట్లు విడుదల చేసింది. ఇక ఈ డబ్బు తల్లుల ఖాతాలో పడిన 10 రోజుల్లో కళాశాలకు వెళ్లి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించని యడల రెండో విడత రీయింబర్స్మెంట్ ను నిలిపివేస్తుంది ప్రభుత్వం.
గతంలో రీయింబర్స్మెంట్ డైరెక్ట్ గా కళాశాలల ఖాతాల్లో పడేది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధానానికి స్వస్తిపలికి నేరుగా తల్లుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తున్నారు. తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లి ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా చెయ్యడం వలన కళాశాలలో తమ పిల్లలు ఎదురుకుంటున్న సమస్యలపై తల్లిదండ్రులకు అవగాహన ఉంటుంది. కళాశాలలో సరైన వసతులు లేకుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే అవకాశం కూడా తల్లిదండ్రులకు ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నేరుగా తల్లి ఖాతాలోనే డబ్బు జమచేస్తుంది.
