Pawan Kalyan : జనసేన అధినేత, మంత్రి పవన్ కల్యాణ్ త్వరలో పిఠాపురంలో పర్యటించనున్నారు. పిఠాపురం పర్యటనకు సంబంధించి పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 20వ తేదీ తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తానని, నియోజకవర్గ ప్రజలను, కార్యకర్తలను కలుస్తానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. పవన్ కల్యాణ్.. పిఠాపురం నుంచి బంపర్ మెజార్టీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో జనసేన 21కి 21 స్థానాలు గెలుచుకుంది.
త్వరలోనే జిల్లాల వారీగా అందరినీ కలుస్తానని మంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక అన్ని వైపుల నుంచి అభినందనలు, శుభాకాంక్షలు అందుతూనే ఉన్నాయన్నారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు, మేధావులు, నిపుణులు, సినీ రంగానికి చెందిన వారు, యువత, రైతులు, ఉద్యోగ వర్గాలు, మహిళలు అభినందనలు అందిస్తున్నారని చెప్పారు. జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఆనందంతో వేడుకలు చేసుకున్నారన్నారు. ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు పవన్ కల్యాణ్.
రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం నన్ను నేరుగా కలిసి అభినందించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశిస్తున్నారని.. త్వరలోనే వారందరినీ జిల్లాల వారీగా కలిసి మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు పవన్ తెలిపారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కేంద్ర కార్యాలయం ద్వారా తెలియ చేస్తామన్నారు. కాగా, తనకు అభినందనలు తెలియ చేయడానికి వచ్చే వారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు పవన్. ఇక, ఈ నెల 20వ తేదీ తర్వాత పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.
Also Read : ఏపీ మెగా డీఎస్సీ.. మొత్తం పోస్టులు ఎన్ని, ఏ కేటగిరీలో ఎన్ని ఖాళీలు అంటే..
”ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. అదే విధంగా శాసనసభ సమావేశాలు కూడా త్వరలోనే ఉంటాయి. వీటిని పూర్తి చేసుకుని నన్ను అఖండ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలను కలుస్తాను. ఈ నెల 20వ తేదీ తర్వాత పిఠాపురం నియోజకవర్గంలోని కార్యకర్తలను కలుస్తాను. ఆ తర్వాత దశలవారీగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తాను” అని పవన్ కల్యాణ్ వెల్లడించారు.