ప్రఖ్యాత స్పోర్ట్స్ వెహికల్ బ్రాండ్ lamborghini ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ను ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ కానుంది. రాష్ట్రంలో ఏర్పాటుకు పలువురి నుంచి ఆమోదం లభించింది. గోల్ఫ్, ఆతిథ్య రంగాల్లో వినియోగించే ప్రీమియం బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి పుణెకు చెందిన కైనటిక్ గ్రీన్ సంస్థ ప్రపోజల్స్ పంపింది. ఇవి బ్యాటరీతో నడిచే వాహనాలు మాత్రమే.
2018లోనే దేశంలో లంబోర్గిని బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసి విక్రయించేందుకు కైనటిక్ గ్రీన్ సంస్థతో ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రాష్ట్రంలో సుమారు వెయ్యి 750 కోట్ల రూపాయల పెట్టుబడితో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్, బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లు, చార్జింగ్ స్వాపింగ్, ఆర్ అండ్ డీ యూనిట్లు ఏర్పాటు చేయడానికి కైనటిక్ గ్రీన్ బోర్డు ఓకే చెప్పింది. కైనటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఫౌండర్ సీఈవో సులజ్జా ఫిరోడియా మోత్వాని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డికి లెటర్ ద్వారా సమాచారం అందించారు.
పోర్టు ఆధారిత సెజ్ ప్రాంతంలో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో యూనిట్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపింది. లంబోర్గిని వాహనాలతో పాటు కైనటిక్ గ్రీన్ బ్రాండ్ పేరుతో ద్వి, త్రిచక్ర వాహనాలను స్థానిక అవసరాలకు తోడు ఎగుమతి చేసే విధంగా యూనిట్ను ఏర్పాటు చేయనున్నారు. వచ్చే పదేళ్లలో కేవలం రాష్ట్రంలోనే 5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయిస్తామని, దీనివల్ల 2కోట్ల 30లక్షల మెట్రిక్ టన్నుల కాలుష్య ఉద్గారాలు తగ్గుతాయన్నారు.
ఇలా కాలుష్యం తగ్గించడమంటే.. 147.34 కోట్ల చెట్లను పెంచడానికి సమానమని ప్రతిపాదనల్లో తెలిసింది. భారీ మెగా ప్రాజెక్టుగా పరిగణించి దానికి అనుగుణంగా రాయితీలు ఇవ్వాల్సిందిగా కోరారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఆర్ అండ్ డీలో డెవలప్ చేసిన టెక్నాలజీ వాణిజ్యపరంగా వినియోగిస్తే దానిపై ఒక శాతం రాయల్టీ చెల్లించడానికి కంపెనీ ప్రతిపాదించింది.