Botsa On Three Capitals : తగ్గేదేలే.. 3 రాజధానులపై సభలో బిల్లు- బొత్స సత్యనారాయణ
ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై వైసీపీ ప్రభుత్వం తగ్గేదేలే అంటోంది. (Botsa On Three Capitals)
- Naveen
- Published On : March 22, 2022 / 10:37 PM IST
Botsa On Three Capitals
Botsa On Three Capitals : ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై వైసీపీ ప్రభుత్వం తగ్గేదేలే అంటోంది. సందర్భం వచ్చినప్పుడల్లా మంత్రులు దీనిపై స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానుల అంశంపై హాట్ కామెంట్స్ చేశారు. ఏపీకి మూడు రాజధానులు అన్న విధానానికే తాము కట్టుబడి ఉన్నామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రానికి మూడు రాజధానులు అనేది తమ పార్టీ, ప్రభుత్వ విధానమని చెప్పిన బొత్స.. పాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. సమయం చూసుకుని సభలో బిల్లు ప్రవేశపెడతామని వెల్లడించారు. మొదటి నుండి మూడు రాజధానులే మా విధానం అని చెబుతున్నామన్న బొత్స.. రాష్ట్ర సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని అన్నారు. మూడు రాజధానుల గురించి మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో వేడిని మరింత పెంచాయి.(Botsa On Three Capitals)
స్మార్ట్ సిటీ మిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసినవారికి ఇంకా పెద్ద పదవులు ఇస్తామేమో? అని బొత్స అన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై ఎమ్మెల్సీలతో చర్చించామని… అన్నీ పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు. మున్సిపల్ స్కూళ్లలో టీచర్ల సంఖ్య పెంచమని కొన్ని సంఘాలు అడిగాయన్న ఆయన ఆ దిశగానూ చర్యలు తీసుకుంటామన్నారు.(Botsa On Three Capitals)
Amaravati : రాజధాని ప్రాంత రైతులకు CRDA లేఖలు
రాజధాని అంశంపై ఏపీలో తీవ్ర వివాదం నడుస్తోంది. ఏపీకి ఒక్కటే రాజధాని అదీ అమరావతే అని టీడీపీ అంటుంటే.. ఒక్కటి కాదు మూడు రాజధానులు అని వైసీపీ అంటోంది. మూడు రాజధానులు వద్దు ఒక్క రాజధాని ముద్దు, ఏపీకి అమరావతిని మాత్రమే రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకోవడం తెలిసిందే.(Botsa On Three Capitals)
రాష్ట్ర విభజన తర్వాత అమరావతి ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటిస్తూ అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. తాత్కాలికంగా అసెంబ్లీతో పాటు సెక్రటేరియట్ కూడా నిర్మించారు. హైకోర్టును కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
దీనిపై అమరావతి రైతులు భగ్గుమన్నారు. ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ సీఆర్డీఏ రద్దు చట్టం, మూడు రాజధానుల చట్టాలను సవాల్ చేస్తూ రాజధాని రైతులతో పాటు పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరుగుతుండగానే.. ఆ చట్టాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం (యాక్ట్ 11/2021) తీసుకొచ్చింది.
మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసుకున్నప్పటికీ తాము దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కొన్ని అభ్యర్థనలు మిగిలే ఉన్నాయని, వాటిపై విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు లాయర్లు కోర్టును కోరారు. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ను అమలు చేసేలా, భూసమీకరణ పథకం కింద భూములిచ్చిన రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇచ్చేలా చూడాలని కోరారు. సీఆర్డీఏ చట్టాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేసేలా ఆదేశించాలని, రాజధానిలో ఆగిపోయిన పనులను కొనసాగించాలని దనలు వినిపించారు. కాగా, మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని.. ఇక ఈ పిటిషన్లపై విచారణ అవసరం లేదని ప్రభుత్వం తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. ఫిబ్రవరి 4న ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది.
Botsa Satyanarayana: రాజధాని అంశంలో హైకోర్టు తీర్పుపై స్పందించిన మంత్రి బొత్స
మార్చి 3న.. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్ర నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని.. ఉన్నది ఉన్నట్లుగా మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని.. సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని సూచించింది. 6 నెలల్లో ఒప్పందం ప్రకారమే అభివృద్ధి చేయాలని.. మూడు నెలల్లో రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని ధర్మాసనం ఆదేశించింది.
ఒప్పందం ప్రకారం 6నెలల్లో మాస్టర్ ప్లాన్ను పూర్తి చేయాలని హైకోర్టు సూచించింది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. రాజధాని అవసరాలకు తప్ప వేరే వాటికి భూములు ఇవ్వకూడదని.. అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదని సూచించింది. పిటిషన్ల ఖర్చుల కోసం రూ.50 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే కొంతమంది న్యాయమూర్తులు ఈ కేసును విచారించొద్దన్న పిటిషన్ను కూడా కోర్టు కొట్టేసింది. 75 కేసుల్లో వేర్వేరుగా త్రిసభ్య ధర్మాసనం తీర్పును వెల్లడించింది.
