కాపులకు వెయ్యి కోట్లు ఇస్తానన్న చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు-కన్నబాబు
- veegam team
- Updated on- June 21, 2021 / 03:08 PM IST
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ కాపు నేస్తం పథకంపై జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు మంత్రి కన్నబాబు కౌంటర్ ఇచ్చారు. అంకెల గారడీతో జగన్ ప్రభుత్వం కాపులను మోసం చేస్తోందన్న పవన్ వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. కాపు నేస్తం అద్భుతమైన పథకం అన్నారు. కాపు నేస్తం కింద మహిళలకు ఏటా రూ.15వేలు అందిస్తున్నామని మంత్రి వివరించారు. కాపుల కోసం ఏడాదిలో రూ.4,769 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. కాపు నేస్తం పథకంపై పవన్ కల్యాణ్ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. శనివారం(జూన్ 27,2020) మీడియాతో మాట్లాడిన కన్నబాబు.. పవన్ తీరుని తప్పుపట్టారు.
చంద్రబాబు అంటే ప్రేమ:
కాపులకు తొలి ఏడాది వెయ్యి కోట్లు ఇస్తానని కేవలం వంద కోట్లు ఇచ్చిన చంద్రబాబును పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమనేత ముద్రగడను పచ్చి బూతులు తిట్టినప్పుడు పవన్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. పవన్కు చంద్రబాబు ప్రపంచ సంస్కర్తగా కనిపిస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పట్ల ప్రేమను పవన్ దాచుకోలేకపోతున్నారని విమర్శించారు. సీఎం జగన్ అంటే పవన్ కు నచ్చదని అందుకే విమర్శలు చేస్తున్నారని కన్నబాబు అన్నారు.
Read: ఏపీలో భయపెడుతున్న కరోనా కేసులు
