Lakshmi Parvathi: అమిత్ షాను చంద్రబాబు కలవలేదు.. కలిస్తే ఫోటో చూపించాలి..
చంద్రబాబుకు గెలుపు మీద ఆశలు లేవు.. అందుకే అందరికీ ఒంగిఒంగి నమస్కారాలు పెడుతున్నారని నందమూరి లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు.
- Naga Srinivasa Rao Poduri
- Published On : February 9, 2024 / 12:27 PM IST
Nandamuri Lakshmi Parvathi comments on chandrababu delhi visit
Nandamuri Lakshmi Parvathi: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవలేదని ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమి చైర్పర్సన్ లక్ష్మీపార్వతి ఆరోపించారు. శుక్రవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నుంచి చంద్రబాబును కార్యకర్తలే తరిమేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఇప్పటికీ సయోధ్య లేదని వ్యాఖ్యానించారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దారితప్పిన బాణం అంటూ విమర్శించారు.
”చంద్రబాబు అంటేనే అవినీతి, అక్రమాలకు చిరునామా. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఇప్పుడు ఎలా ఉంది? చంద్రబాబు దుర్మార్గాలను టీడీపీ కార్యకర్తలు గ్రహంచాలి. టీడీపీలో నుండి కార్యకర్తలే చంద్రబాబును తరిమేయాలి. బీజేపీ అధికారంలోకి వస్తుందని మోదీ పార్లమెంటులో చెప్పగానే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. గంటసేపు ఢిల్లీలో చంద్రబాబు కనపడలేదు. వెంటనే ఒక ఫేక్ సర్వే బయటకు వచ్చింది. అలాంటి వ్యవహారాలు చేయటంలో చంద్రబాబు దిట్ట. ఎన్టీఆర్కీ, ఆయన పిల్లలకీ మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు జగన్ కుటుంబంలోనూ చిచ్చు పెట్టాడు. జగన్ లాంటి వ్యక్తిని మళ్ళీ సీఎం చేసుకోవాలి.
Also Read: తోక పార్టీలన్నీ కలిసినా జగన్ను ఏమి చేయలేవు.. మళ్లీ నగరి నుంచే పోటీ చేస్తా!
ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అమిత్ షాను కలవలేదు.. కలిస్తే ఆ ఫోటో చూపించాలి. చంద్రబాబు అందరికీ ఒంగిఒంగి నమస్కారాలు పెడుతున్నారు. చంద్రబాబుకు గెలుపు మీద ఆశలు లేవు. అందుకే అన్నిసీట్లనూ బీజేపీకి ఇచ్చేందుకు సిద్దపడ్డారు. టీడీపీకి ఈ ఎన్నికలతో ఎండింగ్ కార్డు పడుతుంది. షర్మిల దారి తప్పిన బాణం.. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు చదవటమే షర్మిల పని. చంద్రబాబు, జనసేన మధ్య ఇప్పటికీ సయోధ్య లేదు. లోకేశ్ వస్తే పార్టీకి నష్టమని సొంత పార్టీ వారే అంటున్నార”ని లక్ష్మీపార్వతి అన్నారు.
