Nara Lokesh Padayatra: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) సోమవారం నాటికి 100వ రోజుకు చేరింది. నంద్యాల జిల్లా (Nandyala District) శ్రీశైలం నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సాగింది. 100వ రోజు పాదయాత్రలో నారా లోకేశ్.. బోయరేవుల క్యాంప్సైట్ నుంచి బండిఆత్మకూరు శివారు విడిది కేంద్రం వరకు దాదాపు 12కి.మీ మేర పాదయాత్రలో పాల్గొన్నారు.
Yuva Galam Padayatra
లోకేశ్తో కలిసి పాదయాత్రలో పాల్గొన్న భువనేశ్వరి ..
యువగళం పాదయాత్ర 100వ రోజుకు చేరుకోవడంతో లోకేశ్ తల్లి నారా భువనేశ్వరి పాదయాత్రలో పాల్గొన్నారు. భువనేశ్వరితో పాటు నారా, నందమూరి కుటుంబ సభ్యులు యాత్రలో పాల్గొని లోకేశ్ వెంట ముందుకు సాగారు. నారా భువనేశ్వరి పాదయాత్రలో పాల్గొనడంతో భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. దీంతో పాదయాత్ర ప్రాంతం జాతరను తలపించింది.
పాదయాత్ర వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా మోతుకూరులో పైలాన్ ను లోకేశ్ ఆవిష్కరించారు. లోకేశ్ వెంట భువనేశ్వరి నడుస్తున్న క్రమంలో ఆమె షూ లేస్ ఊడటాన్ని గమనించిన లోకేశ్ తన చేతులతో తల్లి షూ లేస్లు కట్టారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా గుమ్మికూడారు. పాదయాత్ర సందర్భంగా బోయరేవుల క్యాంప్ సైట్, మోతుకూరు పరిసరాల్లో మూడు కిలో మీటర్లుమేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
అవతార పురుషుడైనా ఒక అమ్మకు కొడుకే… అని ఓ కవి అన్నట్టుగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి… కోట్లాది ఆంధ్రుల ఆశాజ్యోతి నారా లోకేష్ గారు కూడా తన తల్లి దగ్గర పిల్లవాడు అయిపోయాడు. 100వ రోజు పాదయాత్రలో తనతో పాటు నడుస్తున్న భువనేశ్వరి గారి షూ లేస్ ఊడిపోగా ఆయనే స్వయంగా కట్టారు pic.twitter.com/TCI9l43OkT
— Telugu Desam Party (@JaiTDP) May 15, 2023
పాదయాత్రలో నారా, నందమూరి కుటుంబ సభ్యులు..
లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారంతో వందో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా లోకేశ్ తల్లి నారా భువనేశ్వరితో పాటు నారా, నందమూరి కుటుంబ సభ్యులు హైమావతి, ఇందిర, నందమూరి జయశ్రీ, నందమూరి మణి, సీహెచ్ శ్రీమాన్, సీహెచ్ చాముండేశ్వరి, గారపాటి శ్రీనివాస్, కంఠమనేని దీక్షిత, కంఠమనేని బాబీ, ఎనిగళ్ల రాహుల్ తదితరులు పాదయాత్రలో పాల్గొని లోకేశ్ వెంట ముందుకు సాగారు.
పాదయాత్ర 100వ రోజుకు చేరుకున్న సందర్భంగా లోకేశ్ తన ట్విటర్ ఖాతాలో ఆసక్తికర పోస్టు చేశారు. అడ్డంకుల్ని లెక్క చేయలేదు. ఎండలకి ఆగిపోలేదు. వాన పడితే చెదిరిపోలేదు. ప్రజలకోసం నేను.. నా కోసం ప్రజలు యువగళం పాదయాత్రని ముందుండి నడిపిస్తున్నారు. యువగళం పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలు, యువగళం వలంటీర్లు, కమిటీలు, టీడీపీ కుటుంబ సభ్యులు, అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలు. పాదయాత్ర ప్రజల యాత్ర అయింది. యువగళం జనగళమైంది. యువగళం పాదయాత్రని విధ్వంసక, ఆటవిక సర్కారుపై ప్రజాదండ యాత్రని చేసిన ప్రతీఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అని లోకేశ్ ట్వీట్ చేశారు.
అడ్డంకుల్ని లెక్క చేయలేదు. ఎండలకి ఆగిపోలేదు. వాన పడితే చెదిరిపోలేదు. ప్రజల కోసం నేను..నా కోసం ప్రజలు యువగళం పాదయాత్రని ముందుండి నడిపిస్తున్నారు.(1/3)#100DaysofYuvagalam pic.twitter.com/aCTASuC0PP
— Lokesh Nara (@naralokesh) May 15, 2023