NHRC: పోలీస్ స్టేషనా? టార్చర్ రూమా? సాయికృష్ణ డెత్పై NHRC ఆగ్రహం.. బాధితుడి అస్థికలను వెలికితీయాలని ఆదేశాలు
విజయవాడ సాయికృష్ణ కస్టడీ మరణం కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
- V Santhosh Kumar
- Published on- June 27, 2026 / 12:36 PM IST
National Human Rights Commission expresses displeasure over the conduct of Vijayawada police in the Sai Krishna death case.
- సాయికృష్ణ కస్టడీ మరణం ఘోరం
- పోలీసులపై ఎన్హెచ్ఆర్సీ తీవ్ర ఆగ్రహం
- డిలీట్ ఫుటేజీ రికవరీకి ఆదేశం
NHRC: విజయవాడలో జరిగిన సాయికృష్ణ కస్టడీ మరణం కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన కమిషన్, ఏపీ డీజీపీ, విజయవాడ సీపీలకు నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా ఈ ఘోర ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కస్టడీ హింసను దాచేందుకు మృతదేహాన్ని కాల్చివేసి, ఆ బూడిదను నదిలో కలిపారనే ఆరోపణలపై NHRC తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో అక్రమ నిర్బంధం, కస్టడీ హింస జరిగినట్లు సిట్ (SIT) ప్రాథమికంగా నిర్ధారించింది.
CM Vijay: స్కూల్ ఐడీ కార్డుల్లో కులం.. సీఎం విజయ్ నిర్ణయంపై తీవ్ర విమర్శలు.. మండిపడుతున్న నెటిజన్స్
ఆధారాల ధ్వంసం, సీఐ సస్పెన్షన్:
ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజ్, బాధితుడి తల్లితో “నీ కొడుకుకు దండ కొనుక్కో” అని అత్యంత అమానుషంగా మాట్లాడిన ఉదంతాన్ని కమిషన్ ప్రస్తావించింది. ప్రస్తుతం సీఐ నాగరాజ్ను సస్పెండ్ చేసి, సిట్ విచారణ అనంతరం రిమాండ్కు తరలించారు. పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజీని కావాలనే డిలీట్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో, ఆ డిలీట్ చేసిన ఫుటేజీని తక్షణమే రికవర్ చేయాలని NHRC ఆదేశించింది. అలాగే, నిజాలను నిగ్గుతేల్చేందుకు నదిలో కలిపిన బాధితుడి అస్థికలను వెలికితీయాలని కమిషన్ సూచించింది.
బాధితురాలికి రక్షణ, నివేదికకు ఆదేశం:
కుమారుడిని కోల్పోయి న్యాయం కోసం పోరాడుతున్న బాధితుడి తల్లి గాదె విజయలక్ష్మికి పోలీసులు తక్షణమే పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది. సాక్ష్యాలను తారుమారు చేయకుండా, బాధితులకు ఎలాంటి హాని జరగకుండా చూడాలని పేర్కొంది. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ (FIR) పురోగతి, నిందితులైన పోలీసులపై తీసుకున్న చర్యలు, బాధిత కుటుంబానికి చెల్లించాల్సిన పరిహారంపై పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను తమకు సమర్పించాలని NHRC ఏపీ పోలీసు యంత్రాంగాన్ని గట్టిగా ఆదేశించింది.
