ఢిల్లీని తాకిన విశాఖ ఉక్కు ఆందోళనలు..ఏపీ భవన్ ఎదుట ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తల ధర్నా

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఏపీ భవన్ ఎదుట ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

NSUI activists protest against privatization of Visakhapatnam steel plant : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఏపీ భవన్ ఎదుట ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలు … కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఏపీ ఎంపీలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకుంటామంటూ నినాదాలు చేస్తున్నారు.

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ప్లాంట్‌ను లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ఉన్న ప్రత్యామ్నాయాలను సూచించారు. రాష్ట్రపతి పేరిట ఉన్న స్టీల్‌ ప్లాంట్‌ భూములను కర్మాగారానికి బదలాయించాలన్నారు. వాటిని అమ్మి ప్లాంట్‌ నిర్వహణ మూలధనం సమకూర్చుకోవచ్చని సూచించారు.

విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ ప్రైవేటీకరణ చ‌ర్య‌ల‌కు వ్య‌తిరేకంగా కార్మిక సంఘాలు పెద్దఎత్తున పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీలు సైతం వీరి ఉద్యమానికి అండగా నిలిచాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె సైరన్ మోగింది. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 25 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు వెళ్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఈ మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీకి కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేంత వరకు సమ్మె చేస్తామని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి.

ట్రెండింగ్ వార్తలు