జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటన కొనసాగుతోంది. 2019, డిసెంబర్ 05వ తేదీ గురువారం చిత్తూరు జిల్లాలోని మదనపల్లె టమాట మార్కెట్లో పర్యటించనున్నారు. రైతుల కష్టనష్టాలు అడిగి తెలుసుకోనున్నారు. కానీ..పవన్ పర్యటనకు అధికారులు నో చెప్పారు. దీంతో బుధవారం అంతా..టెన్షన్ వాతావరణం నెలకొంది.
పవన్ ఇక్కడకు వస్తే..వినియోగదారులకు, వ్యాపారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని భావించిన అధికారులు పర్యటనకు నో చెప్పారు. దీనిపై పవన్ సీరియస్ అయ్యారు. పర్యటించి తీరుతానని, అనుమతి ఇవ్వకపోతే..మార్కెట్ ముందే బైఠాయించి..రైతుల సమస్యలు తెలుసుకుంటానని పవన్ స్పష్టం చేశారు. దీంతో అధికారులు ఆలోచించి పర్యటనకు ఒకే చెప్పారు. కానీ 10గంటలకు కాకుండా…11.30గంటలకు రావాలని పవన్కు అధికారులు సూచించారు. కావాలనే తమ అధినేత పర్యటనను అడ్డుకుంటున్నారని జనసైనికులు ఆరోపిస్తున్నారు.
పవన్ రాయలసీమ పర్యటనలో మాటల ఘాటు మరింత పెరిగింది. ఈ ఆర్నెల్లలో ప్రభుత్వం సాధించిందేంటని నిలదీశారు పవన్. అంతే కాకుండా… చట్టాలు చేయాల్సిన మంత్రులు బూతులు మాట్లాడుతున్నారంటూ రుసరుసలాడారు. ఈనాటి రాజకీయాలకు మోదీ, అమిత్ షాలే కరెక్ట్ అంటూ పొలిటికల్ బాంబ్ పేల్చారు. అంతే కాకుండా… బీజేపీకి తాను దూరంగా లేనని.. కలిసే ఉన్నానని పవన్ స్పష్టం చేశారు. కేవలం ఏపీకి ప్రత్యేక హోదా విషయంలోనే.. బీజేపీతో విభేదించినట్లు జనసేనాని స్పష్టం చేశారు. అంతే తప్ప.. బీజేపీకి తాను దూరంగా లేనని క్లారిటీ ఇచ్చారు.
Read More : వివేకా హత్య కేసు : ఎమ్మెల్సీ బీటెక్ రవి విచారణ