PAC Chairman Post: పీఏసీ చైర్మన్ ఎంపికపై ఉత్కంఠ.. వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి నామినేషన్.. పయ్యావుల కీలక వ్యాఖ్యలు
అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. పీఏసీ చైర్మన్ ను సభ్యులు ఎన్నుకుంటారు. సుమారు 20 మంది ..
- Harishth Thanniru
- Published On : November 21, 2024 / 01:24 PM IST
Peddireddy Ramachandra Reddy
AP Assembly 2024: ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఈ పదవి కోసం వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. గురువారం ఉదయం అసెంబ్లీకి వచ్చిన ఆయన నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ ను ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ బలపర్చారు. ప్రతిపక్షానికే పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని, ఆ పదవిని ప్రతిపక్ష పార్టీ వైసీపీకి ఇవ్వాలని ఆ పార్టీ కోరుతుంది. పీఏసీ కమిటీలో 12 మంది సభ్యులు ఉంటారు. శాసనసభ నుంచి తొమ్మిది మంది, మండలి నుంచి ముగ్గురు ఉంటారు. అసెంబ్లీ సభ్యుల నుంచే చైర్మన్ నియమితులవుతారు. శాసనసభ స్పీకర్ దీనిపై నిర్ణయం తీసుకుంటారు.
వాస్తవానికి.. పీఏసీ సభ్యుడిగా ఎన్నిక కావడానికి 18మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. కానీ, వైసీపీకి ఉన్నది 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. గతంలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి ఒక్క సభ్యుడిని ఎన్నుకునేంత బలం ఉండటంతో పయ్యావుల కేశవ్ కు అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం నుంచి పీఏసీ చైర్మన్ ఉండాలన్న సంప్రదాయం మేరకు ఆయననే చైర్మన్ గా నియమించారు. ప్రస్తుత అసెంబ్లీలో మాత్రం ఒక్కరిని ఎన్నుకునేంత బలం కూడా వైసీపీకి లేదు. అయితే, ప్రస్తుతం వైసీపీ చైర్మన్ బరిలోకి దిగడంతో పీఏసీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.
అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. పీఏసీ చైర్మన్ ను సభ్యులు ఎన్నుకుంటారు. సుమారు 20 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే ఎవరైనా పీఏసీ సభ్యుడిగా ఎన్నికవుతారు. ఎన్నికైన వారిని పీఏసీ చైర్మన్ గా స్పీకర్ నామినేట్ చేస్తారని పయ్యావుల అన్నారు.
