Ayyannapatrudu arrested : మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu)ని విశాఖపట్నం ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా ఇటీవల గన్నవరంలో నిర్వహించిన సభలో అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యన్న సభలో ప్రసంగిస్తు సీఎం జగన్, పలువురు మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్న అయ్యన్నపాత్రుడిని పోలీసులు ఎయిర్ పోర్టులోనే అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ని కృష్ణాజిల్లాకు తరలించారు. అయ్యన్నపై 153a, 354A1(4), 504, 505(2), 509 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కృష్ణా జిల్లాకు లోకేశ్ పాదయాత్ర చేరుకున్న క్రమంలో టీడీపీ నేతలు గన్నవరంలో భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో టీడీపీకి చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సభలో పాల్గొన్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సీఎం జగన్ తో పాటు పలువురు మంత్రులను ఘాటు విమర్శలు చేశారు. అలాగే ఈ సభలో పాల్గొన్న అయ్యన్న సహా ఇతర నేతలు చేసిన ప్రసంగాలపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లుగా సమాచారం.