డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీలోకి పవర్‌ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్..! ఎవరీ కృష్ణతేజ..

ఐఏఎస్ అధికారి కృష్ణతేజను జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ అవార్డ్ వరించింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఆయనను ప్రత్యేకంగా ప్రశంసించారు.

Ias Krishna Teja Mylavarapu : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓఎస్డీగా తెలుగు ఐఏఎస్ అధికారి రానున్నారు. కేరళ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ మైలవరపు వీఆర్ కృష్ణతేజను డిప్యుటేషన్ పై ఏపీకి రప్పించి తన ఓఎస్డీగా నియమించాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన కూడా ఓకే చెప్పారు. దీంతో కృష్ణతేజను ఏపీకి డిప్యుటేషన్ పై తీసుకొచ్చే ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ప్రస్తుతం కేరళలోని త్రిస్సూర్ కలెక్టర్ గా పని చేస్తున్న కృష్ణతేజను డిప్యుటేషన్ పై ఏపీకి పంపాలని కేంద్రానికి లేఖ రాశారు.

పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ ఇటీవల సెక్రటేరియట్ లో పవన్ కల్యాణ్ ను కలిశారు. గతవారం ఐఏఎస్ అధికారి కృష్ణతేజను జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ అవార్డ్ వరించింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఆయనను ప్రత్యేకంగా ప్రశంసించారు.

బాలల హక్కుల రక్షణలో త్రిసూర్ జిల్లా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. దీని వెనుక జిల్లా కలెక్టర్ కృష్ణతేజ కృషి ఎంతో ఉంది. త్వరలోనే ఆయన పురస్కారం అందుకోబోతున్నారు. దీనికి తోడు క్రిష్ణతేజ ఎంతో సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందారు. కేరళలో వరదలు, ప్రళయం నెలకొన్న సమయంలో ఆయన చూపించిన చొరవ జాతీయ స్థాయిలో అందరినీ ఆకట్టుకుంది. ఆ సమయంలో క్రిష్ణతేజ అలప్పి జిల్లా సబ్ కలెక్టర్ గా ఉన్నారు. ఆ తర్వాతి కాలంలో ఆయనను కేరళ పర్యాటక శాఖ డైరెక్టర్ గా నియమించారు. అనంతరం త్రిస్సూర్ జిల్లా కలెక్టర్ బాధ్యతలు అందుకున్నారు.

డిప్యూటీ సీఎంగా తన బాధ్యతల విషయంలో కృష్ణతేజ అనుభవం ఉపయోగపడుతుందని పవన్ కల్యాణ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే, కృష్ణతేజను తన ఓఎస్డీగా నియమించుకోవాలని పవన్ కల్యాణ్ పట్టుదలతో ఉన్నారు. ఒక పక్క కేరళ నుండి డిప్యుటేషన్ పై తీసుకొచ్చేందుకు ప్రక్రియ జరుగుతుండగానే, అనధికారికంగా పవన్ కు ఓఎస్డీగా కృష్ణతేజ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో కృష్ణతేజ అన్ని విషయాలు దగ్గరుండి చక్కబెడుతున్నారు.

Also Read : రుషికొండపై విలాసవంతమైన భవనాలు.. వైసీపీ నేతలు ఎందుకు రహస్యంగా ఉంచారు? ప్రచారం చేసుకోకపోవడానికి కారణమేంటి?

ట్రెండింగ్ వార్తలు