Vizianagaram Train Accident : రైలు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాహుల్, ఖర్గే.. కాంగ్రెస్ కార్యకర్తలకు కీలక సూచన
బాలాసోర్ రైలు దుర్ఘటన తర్వాత రైల్వే భద్రతకు సంబంధించిన కేంద్రం వాదనలన్నీ గాలిలో ఆవిరైపోయినట్లు కనిపిస్తోందని మల్లిఖార్జున ఖర్గే అన్నారు.
- Harishth Thanniru
- Published On : October 30, 2023 / 11:38 AM IST
Rahul Gandhi and Mallikarjun Kharge
Rahul Gandhi – Mallikarjun Kharge: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం విధితమే. కొత్తవలస మండలం కంటకాపల్లి – ఆలమండ మధ్య ఆదివారం రాత్రి 7గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో 14 మంది మృతిచెందారు. ఈ ప్రమాదంలో వంద మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరికి చికిత్స అందిస్తున్నారు. అయితే, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రైలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
రైలు ప్రమాద ఘటనపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. రైలు ప్రమాదంలో మరణాలు, గాయాలపాలైన వార్తలతో కలత చెందానని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని రాహుల్ గాంధీ తెలిపారు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని తెలిపారు. సహాయ కార్యక్రమాలలో పరిపాలనకు సాధ్యమైన అన్ని సహాయాన్ని అందించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ గాంధీ సూచించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రైలు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైలు ప్రమాద ఘటన గురించి తెలుసుకొని చాలా బాధపడ్డానని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. బాలాసోర్ రైలు దుర్ఘటన తర్వాత రైల్వే భద్రతకు సంబంధించిన కేంద్రం వాదనలన్నీ గాలిలో ఆవిరైపోయినట్లు కనిపిస్తోందని ఖర్గే అన్నారు. ఆర్భాటాలు, ప్రచారంతో రైళ్లను ప్రారంభించడంపై ఉన్న ఉత్సాహం రైల్వే భద్రత, కోట్లాది మంది రోజువారీ ప్రయాణికుల భద్రత చర్యల్లో కూడా చూపాలని ఖర్గే కోరారు.
