Mukesh Ambani visited Tirumala: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం అభిషేకం, నిజపాద దర్శన సేవలో పాల్గొన్నారు. రంగనాయకుల మండపంలో అంబానీకి పండితులు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అంతకుముందు ఆలయానికి చేరుకున్న ముఖేశ్ అంబానీకి టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. అంబానీ వెంట ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధిక మర్చంట్ కూడా ఉన్నారు.
తిరుమలకు ముకేశ్ అంబానీ రావడంతో ఆయన వెంట ఎంపీ విజయసాయిరెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు.
స్వామివారి దర్శనానంతరం ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దేశ ప్రజలందరికీ శ్రీవారి ఆశీస్సులు కలగాలని కోరుకున్నానని తెలిపారు. ప్రతి ఏడాది తిరుమలలోని శ్రీవారి ఆలయం అభివృద్ధి చెందుతూ.. మెరుగవుతూ ఉందన్నారు.