AP Assembly Budget Session-2023: సభలో రౌడీయిజం చేశారు: మంత్రులు రోజా, రజనీ
సభలో రెచ్చిపోయిన టీడీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రోజా కోరారు. పబ్లిసిటీ పిచ్చి కోసం చంద్రబాబు నాయుడు 11 మందిని చంపారని, జీవో నంబరు 1 ప్రజల రక్షణ కోసమేనని చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు కౌరవ సభను నడిపారని, ఇప్పుడు సీఎం జగన్ గౌరవ సభను నడుపుతున్నారని రోజా చెప్పారు.
- T Venkateshwarlu
- Published On : March 20, 2023 / 12:10 PM IST
AP Assembly Budget Session-2023
AP Assembly Budget Session-2023: జీవో నంబరు 1పై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చకు టీడీపీ నేతలు పట్టుబట్టగా చోటుచేసుకున్న పరిణామాలపై ఏపీ మంత్రులు రోజా, రజనీ విమర్శలు గుప్పించారు. సభలో రౌడీయిజం చేశారని అన్నారు. ఇవాళ శాసనసభలో వారు మాట్లాడారు. కుట్ర రాజకీయాలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి అలవాటేనని మంత్రి రోజా అన్నారు.
సభలో రెచ్చిపోయిన టీడీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రోజా కోరారు. పబ్లిసిటీ పిచ్చి కోసం చంద్రబాబు నాయుడు 11 మందిని చంపారని, జీవో నంబరు 1 ప్రజల రక్షణ కోసమేనని చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు కౌరవ సభను నడిపారని, ఇప్పుడు సీఎం జగన్ గౌరవ సభను నడుపుతున్నారని రోజా చెప్పారు. సభలో టీడీపీ సభ్యుల తీరు సరికాదని, వారికి స్పీకర్ అంటే గౌరవం లేదని విమర్శించారు.
టీడీపీ సభ్యులకు సంస్కారం లేదని, వారు సభలో రౌడీయిజం చేశారని మంత్రి రజని అన్నారు. చంద్రబాబు ప్రచార పిచ్చితో అమాయకులు బలయ్యారని, టీడీపీ మారణకాండకు అడ్డుకట్ట వేసేందుకే తాము జీవో నంబరు 1ని తీసుకువచ్చామని చెప్పారు. దాని గురించి టీడీపీ సభ్యులు మాట్లాడుతున్న తీరు సరికాదని అన్నారు. కాగా, చంద్రబాబు నాయుడు సభకు రాకుండా టీడీపీ నేతలతో దాడులు చేయిస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. టీడీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సుధాకర్ బాబు డిమాండ్ చేశారు.
