×
Ad

SSRC Meeting : ముగిసిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం

తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు, లెఫ్ట్ నెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు, మంత్రులు పాల్గొన్నారు.

  • Published On : November 14, 2021 / 09:38 PM IST

Ssrc Meeting

Southern States Regional Council : తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు, లెఫ్ట్ నెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కర్నాటక సీఎం బొమ్మై, తెలంగాణ నుంచి హోంమంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. పలువురు లేవనెత్తిన పలు అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టమైన హామీ ఇచ్చారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఏపీ సీఎం జగన్ ప్రస్తావించిన పలు అంశాలను సావధానంగా విన్న అమిత్ షా సానుకూలంగా స్పందించారు.

ఏపీ విభజన హామీల అమలు అంశాన్ని దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో సీఎం జగన్ గట్టిగా ప్రస్తావించారు. విభజన అనంతరం రాష్ట్రం నష్ట పోయిన విధానాన్ని అమిత్ షాకు సూటిగా వివరించారు. రాష్ట్రాల మధ్య సమస్యలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని, వీటి కోసం ఓ ప్రత్యేక కమిటీ వేయాలని అమిత్ షా ను సీఎం జగన్ కోరారు. విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. సమస్యలన్నీ అపరిష్కృతంగా ఉండటంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం కల్గుతుందన్నారు.

Minister Gangula : వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గంగుల ఆదేశాలు

పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్ధారణలో 2013-14 ధరల సూచీతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదన్నారు. రీసోర్స్ గ్యాప్ నూ భర్తీ చేయలేదని చెప్పారు. తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలను ఇప్పించాలని కోరారు.

తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కలకు ఊరటనివ్వాలన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ కూడా జరగలేదని చెప్పారు.
గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోత విధిస్తున్నారని… దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. రాష్ట్రాల్లో రేషన్ లబ్ధిదారుల గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వ ప్రక్రియలో హేతుబద్ధత లేదన్నారు.