తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, చిత్తూరు మాజీ ఎంపీ, సీనియర్ నటుడు టీడీపీ నేత నారమల్లి శివప్రసాద్(68) కన్నుమూశారు. మూత్ర పిండాల్లో సమస్య కారణంగా శివప్రసాద్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. 2019, సెప్టెంబర్ 21వ తేదీ మధ్యాహ్నం అధికారికంగా ప్రకటించారు వైద్యులు. శివప్రసాద్ ఇక లేరు అని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో శివప్రసాద్ ఓటమి పాలయ్యారు. 2009, 2014లో చిత్తూరు ఎంపీగా ఉన్న ఆయన.. స్వతహాగా నటుడు. శివప్రసాద్ నిరసనల తీరును ప్రధాని నరేంద్ర మోడీ కూడా పార్లమెంట్ లో ప్రస్తావించారు.
ప్రత్యేక హోదా కోసం విచిత్ర వేషధారణలు వేసి నిరసనలు తెలిపి పాపులర్ అయిన శివప్రసాద్.. రెండుసార్లు చిత్తూరు లోక్సభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. తెలుగులో పలు సినిమాల్లో కూడా శివప్రసాద్ నటించారు. కితకితలు, ఆటాడిస్తా, దూసుకెళ్తా, తులసి, మస్కా, ఖైదీ, కుబేరులు, ఒక్క మగాడు వంటి సిినిమాల్లో కీలక పాత్రల్లో ఆయన నటించారు.
ఏపీకి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలంటూ పార్లమెంట్ సమావేశాల సమయంలో ఆయన రకరకాల వేషాలు వేసి జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. శివప్రసాద్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.