Budameru : బుడమేరు గండ్లు పూడ్చివేతకు రంగంలోకి దిగిన ఆర్మీ.. ముమ్మరంగా మూడో గండి పూడ్చివేత పనులు

సీఎం చంద్రబాబు నాయుడు అభ్యర్థన మేరకు బుడమేరు గండ్లు పూడ్చే పనుల్లో పాల్గొనేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 40 మంది ఆర్మీ ఇంజనీర్ల బృందంను పంపించింది.

Budameru

Vijayawada Floods : బుడమేరు వరద ఉధృతి విజయవాడను ముంచెత్తింది. గత ఆరు రోజులుగా నగరంలోని అనేక ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. బుడమేరులో వరద ఉధృతి క్రమంగా తగ్గుతుండటంతో ముంపు ప్రాంతాల్లో వరదనీరు తగ్గుతోంది. మరోవైపు.. ప్రభుత్వం ముంపు బాధితులకు ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాలను అందజేస్తుంది. బుడమేరకు గండ్లు పడటం కారణంగానే విజయవాడ నగరంలోకి వరద నీరు ముంచెత్తింది. దీంతో గండ్లను పూడ్చేందుకు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మంత్రి రామానాయుడు రాత్రిపగలు తేడాలేకుండా అక్కడేఉండి గుండ్లు పూడ్చే పనులను పర్యవేక్షిస్తున్నారు. పనుల వివరాలను ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కు తెలియజేస్తున్నారు.

Also Read : AP Rains : తప్పిన వాయుగుండం ముప్పు.. ఇవాళ ఏపీలోని 13జిల్లాలకు భారీ వర్ష సూచన

విజయవాడ సింగ్ నగర్ ముంపునకు కారణమైన ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి దగ్గర బుడమేరుకు పడిన మూడు గండ్లను పూడ్చేందుకు గత నాలుగు రోజుల నుంచి పనులు కొనసాగుతున్నాయి. అక్కడే ఉండి ఏజెన్సీలతో మంత్రి రామానాయుడు పనులు చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రెండు గండ్లు పూడ్చివేశారు. ఇవాళ తెల్లవారు జామున 3.30 గంటలకు రెండో గండి పూడ్చివేత పనులను పూర్తి చేశారు. వెంటనే మూడో గండిని పూడ్చివేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఆర్మీ ఇంజనీర్ల బృందం కూడా రంగంలోకి దిగింది.

Also Read : విజయవాడలో మునిగిన లక్షలాది బైకులు, మెకానిక్ షాపులకు వాహనదారుల క్యూ..

సీఎం చంద్రబాబు నాయుడు అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 40 మంది ఆర్మీ ఇంజనీర్ల బృందంను పంపించింది. అవసరమైతే మరింత మంది ఆర్మీ ఇంజనీర్ల బృందం ఏపీకి రానుంది. హైదరాబాద్ నుంచి 40 మంది ఆర్మీ ఇంజనీరింగ్ బృందం  ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం గండిపడిన ప్రాంతానికి ఆర్మీ ఇంజనీర్ల బృందం చేరుకుంది. ప్రస్తుతం పనులు నిర్వహిస్తున్న ఏజెన్సీతో కలిసి ఆర్మీ బృందం బుడమేరు గండ్లు పూడ్చే పనుల్లో నిమగమైంది. ఎట్టిపరిస్థితుల్లో శుక్రవారం సాయంత్రం వరకు మూడో గండిని కూడా పూడ్చేందుకు పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

 

 

ట్రెండింగ్ వార్తలు