Kesineni Nani : ఎంపీ టికెట్ ఏ పిట్టల దొరకు ఇచ్చినా అభ్యంతరం లేదు.. ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్ గా గెలుస్తానేమో : కేశినేని నాని
అభివృద్ధి వేరు, పార్టీలు వేరని ఎంపీ కేశినేని నాని అన్నారు. రాష్ట్రంలో రెండు ఫ్లాట్ ఫారంలు మాత్రమే ఉన్నాయని.. ఒకటి చంద్రబాబు, రెండు జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని చెప్పారు.
- bheemraj
- Published On : May 31, 2023 / 05:06 PM IST
Kesineni Nani
Kesineni Nani interesting comments : విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ (Vijayawada) ఎంపీ టికెట్ ఏ పిట్టల దొరకు ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని, ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్ గా గెలుస్తానేమోనని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో బాలుర హైస్కూల్ ప్రహరీ గోడ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. మైలవరం (Mylavaram) ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) తో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
అభివృద్ధి వేరు, పార్టీలు వేరని ఎంపీ నాని అన్నారు. రాష్ట్రంలో రెండు ఫ్లాట్ ఫారంలు మాత్రమే ఉన్నాయని.. ఒకటి చంద్రబాబు, రెండు జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని చెప్పారు. విరోధాలు వాళ్ళిద్దరి మధ్య తప్పితే తమ మధ్య ఏమీ లేవన్నారు. ప్రాంతం అభివృద్ధి కోసం ఎవరితో నైనా కలుస్తానని, విజయవాడ అభివృద్దే తన ధ్యేయం అన్నారు. 2019 ఎన్నికల్లో ఒక్క టీడీపీ కాదు అన్ని పార్టీల వాళ్ళు ఓట్లేస్తేనే తాను గెలిచానని తెలిపారు.
Telangana Formation Day : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. కేంద్రం కీలక నిర్ణయం
వాళ్ళ పార్టీ వాళ్ళది, తన పార్టీ తనది, ఓట్ల కోసం ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయన్నారు. తాను పది సార్లు ఎంపీగా చేయాలని కోరిక ఏమి లేదన్నారు. తానే ఎంపీగా ఉండాలనే రూల్ లేదని చెప్పారు. ఈ ప్రాంతం కోసం ఢిల్లీ స్థాయిలో పనిచేయించే సత్తా తన దగ్గర ఉందన్నారు. ప్రాంతాల అభివృద్ధి కోసం రాజకీయాలకు ముడి పెట్టకూడదన్నారు.
పార్టీల కోసం కొట్టుకోమని క్యాడర్ కు ఏ నాయకుడు చెప్పబోరని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోజు కేంద్ర మంత్రులను తిడతారు, పనికోసం వెళితే కేంద్ర మంత్రులు చేస్తారని తెలిపారు. దేశం కోసం ఎవరైనా పనిచేస్తారని.. పార్టీలు చూడరని వెల్లడించారు. పార్టీల కోసం పని చేయడం వేరు, అభివృద్ధి కోసం పని చేయడం వేరని తెలిపారు. పార్టీల కోసం వ్యక్తిగత ద్వేషాలు, బంధుత్వాలను దూరం చేసుకోవద్దన్నారు.
ఢిల్లీ స్థాయిలో ఎవరు వచ్చినా పని చేస్తానని చెప్పారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. అభివృద్ధి విషయంలో తమ ఇద్దరి బాట ఒక్కటేనని చెప్పారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు, అనంతరం అభివృద్ధి మాత్రమేనని వెల్లడించారు.
నిధుల కోసం సుజనా చౌదరిని కలిశానని పేర్కొన్నారు. ఎంపీ, తాను అడిగితే కొండపల్లికి, నాగులూరుకు నిధులు మంజూరు చేశారని తెలిపారు. కాగా, ఎమ్మెల్యే, ఎంపీ అభివృద్ధి మాటలతో మైలవరంలో చర్చ ప్రారంభమైంది. ఇద్దరు కలిసి పార్టీలను పక్కన పెట్టడంతో వైసీపీ, టీడీపీ శ్రేణుల్లో గుస గుసలు మొదలయ్యాయి.
