Janasena Leaders Bail : విశాఖలో మంత్రుల కార్లపై దాడి కేసులో అరెస్ట్ అయిన జనసేన ఉత్తరాంధ్ర నేతలకు విశాఖ కోర్టు షాక్ ఇచ్చింది. వారికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తమకు బెయిల్ ఇవ్వాలంటూ అరెస్ట్ అయిన జనసేన నేతలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను విశాఖ కోర్టు కొట్టివేసింది. అదే సమయంలో 9మంది నిందితులను తమ కస్టడీకి అప్పగించాలన్న పోలీసుల అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు.. నిందితులను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
విశాఖ గర్జన పేరిట ఉత్తరాంధ్ర జేఏసీ విశాఖలో చేపట్టిన కార్యక్రమానికి వైసీపీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మంత్రులు, వైసీపీకి చెందిన కీలక నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమం జరిగిన రోజే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా పవన్ కు స్వాగతం చెప్పేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చారు జనసైనికులు. కాగా, విశాఖ గర్జన ముగించుకుని వెళ్తున్న మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేశ్, వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి కార్లపై రాళ్ల దాడి జరిగింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
ఈ ఘటనలో పోలీసులు 70 మంది జన సైనికులను అరెస్ట్ చేశారు. వీరందరినీ కోర్టులో హాజరుపరచగా.. అరెస్టయిన వారిలో 61 మంది నిందితులకు అక్కడికక్కడే బెయిల్ లభించింది. మిగిలిన 9 మందికి ఈ నెల 28 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 9 మంది తాజాగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. వారి అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. దీంతో వారికి బెయిల్ రావడానికి మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.