ASC Arjun On Duty : ఈ రోబో చాలా పవర్ ఫుల్ గురూ..! దొంగలను ఇట్టే పట్టేస్తుంది.. ఇద్దరు పాతనేరస్తులను పట్టించింది..
ASC Arjun On Duty : ప్రయాణీకుల భద్రత, రైలు సేవలను ప్రయాణీకులకు సకాలంలో చేరవేయడంతోపాటు, ఇతర విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేసే విధంగా ఇటీవల విశాఖ రైల్వే స్టేషన్లో రైల్ రోబో కాప్ ఎఎస్సీ అర్జున్ను ఏర్పాటు చేశారు.
- Harishth Thanniru
- Published On : February 4, 2026 / 10:36 AM IST
ASC Arjun On Duty
ASC Arjun On Duty : ప్రయాణీకుల భద్రత, రైలు సేవలను ప్రయాణీకులకు సకాలంలో చేరవేయడంతోపాటు, ఇతర విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేసే విధంగా ఇటీవల విశాఖ రైల్వే స్టేషన్లో రైల్ రోబో కాప్ (ఏఎస్సీ అర్జున్) ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రైల్వే స్టేషన్లోని రోబో ఇప్పటికే సమర్థవంతంగా సేవలందించగా, తాజాగా స్టేషన్ ఆవరణలో పలు కేసుల్లో కీలక నేరస్తులుగా ఉన్న ఇద్దరిని ఎస్ఆర్ఎస్ (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్) తో గుర్తించింది.
Also Read : Trump Tariffs : ట్రంప్ సుంకాల తగ్గింపు.. భారత్లోని రొయ్యల పరిశ్రమకు భారీ ఊరట.. ప్రయోజనాలివే..
సోమవారం రాత్రి 8.10 గంటల సమయంలో విశాఖ రైల్వేస్టేషన్లో నిఘా, గస్తీలో ఉన్న ఏఎస్సీ అర్జున్ (రోబో) ఒక అనుమానితుడి ముఖాన్ని తన డేటాబేస్లోని నేరస్తుల చిత్రాలతో పోల్చి చూసింది. ఆయా చిత్రాలతో ఆ నేరస్తుడి ముఖం గుర్తించగానే వెంటనే సమీపంలోని ఆర్ఫీఎఫ్ సిసిటీవీ కంట్రోల్ రూమ్కు అలర్ట్ మేసేజ్ పంపింది. దీంతో తక్షణమే స్పందించిన ఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ బీఎస్ నారాయణ లైవ్ ఫీడ్ను పరిశీలించి, వెంటనే డ్యూటీలోని ఇన్ స్పెక్టర్కు, వాల్తేరు డివిజన్ క్రైం పోలీస్ స్వ్కాడ్కు ఆయా సమాచారాన్ని అందించారు.
అప్రమత్తమైన ఆయా పోలీసుల బృందం స్టేషన్లో తనిఖీలు చేయగా.. అడపా శివ (39), అతని అనుచరుడు జి.బంగారును విజయవంతంగా పట్టుకున్నారు. వీరిద్దరి వద్ద ఎటువంటి ప్రయాణ టిక్కెట్లు లేకపోవడంతో ఆర్ఫీఎఫ్ పోస్టుకు తరలించి విచారించగా, విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
వీరిద్దరూ రాయగడ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొన్నేళ్లుగా దొంగతనం, దోపీడీ, ఆయుధ చట్టం కింద అనేక కేసులు నమోదైనట్టు గుర్తించారు. అనంతరం జీఆర్పీ, ఆర్ఫీఎఫ్ బృందాలు ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. ఇదే విషయాన్ని రాయగడ పోలీసులకుసైతం సమాచారం అందించారు.
వాల్తేరు డీఆర్ఎం లలిత్ బోహ్రా మాట్లాడుతూ.. విశాఖ స్టేషన్లోని రైల్వే రోబో కాప్ అర్జున్ ద్వారా రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో భద్రత, పాతనేరస్తులను పట్టుకోవడంతో విజయవంతమైందన్నారు. ఏఐ ఆధారిత నిఘా, ముఖ గుర్తింపు సాంకేతికత ప్రభావాన్ని స్పష్టంగా గుర్తిస్తుందని, సురక్షితమైన ప్రయా ణాన్ని నిర్ధారిస్తుందన్నారు.
