Vasupalli Ganesh
Vasupalli Ganesh Kumar: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ విజయసాయిరెడ్డి, వైసీపీలోని కొందరి నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 10టీవీతో మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డి వైసీపీని వీడటం వల్ల పార్టీకి చాలా మంచిదైందని అన్నారు. విజయసాయిరెడ్డి లాంటి నేతలు మరికొందరు వైసీపీలో ఉన్నారని, వారుకూడా పార్టీని విడిచి వెళ్లిపోతే బాగుంటుందని చెప్పారు.
వైసీపీ హయాంలో పేద వర్గాల ప్రజలకు మెరుగైన పాలన అందించామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సూపర్ సిక్స్ హామీల అమల్లో పూర్తిగా విఫలమైందని గణేశ్ ఆరోపించారు. ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చడం లేదని, ప్రజలకు ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి దేవుడిలా కనిపిస్తున్నాడని ఆయన అన్నారు. వల్లభనేని వంశీ విషయంపై మాట్లాడుతూ.. వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు సరైంది కాదు. అధికారంలో ఉన్నాంకదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు. వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా లాంటి నేతలు అధికారంలో ఉన్నామని హద్దులు మీరి మాట్లాడారు. జగన్ ఇచ్చిన అవకాశాన్ని పార్టీకి నష్టం చేసేలా వారు వ్యవహరించారు. రాజకీయాల్లో నేతలు హూందాగా ఉండాలి. అలాఉంటేనే ప్రజలు హర్షిస్తారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోని కొందరు నేతలు అధికార అహంతో వ్యవరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీరు వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తుందని వాసుపల్లి గణేశ్ అన్నారు.
విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవటం మంచిదైంది. విజయసాయిరెడ్డి లీడర్ కాదు. గతంలోనూ ఈ విషయాన్ని నేను చెప్పాను. విశాఖలో సెటిల్ మెంట్లు చేసి దోపిడీ చేశారు. ఆయన చేసిన పనులతో పార్టీకి నష్టం జరిగింది. రీజనల్ కో-ఆర్డినేటర్ వ్యవస్థ ఫెయిల్ అయింది. పార్టీ కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలు జగన్ వద్దకు చేరకుండా ఆయన అడ్డుకున్నారు. జగన్ ఈ విషయాన్ని గ్రహించాలని గణేశ్ కోరారు. విజయసాయిరెడ్డి తరహాలో వల్లభనేని వంశీ, కొడాలి నానిలు కూడా పార్టీని వీడి వెళ్లిపోతే మంచిది, రోజా కాస్త తక్కువ మాట్లాడితే బాగుంటుందని వాసుపల్లి గణేశ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.