YS Jagan : కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన.. భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు.. గుమ్మడికాయతో దిష్టితీసి.. పూలు చల్లుతూ ఘన స్వాగతం..
YS Jagan : మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో
- Harishth Thanniru
- Updated on- November 4, 2025 / 11:36 AM IST
YS Jagan
YS Jagan : మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటించి.. తుపాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి.. రైతులతో మాట్లాడనున్నారు. పెనమలూరు, పెడన, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాల్లోని తదితర ప్రాంతాల్లో జగన్ పర్యటన సాగనుంది.
కృష్ణా జిల్లాలో పర్యటనలో భాగంగా.. విజయవాడ తూర్పు నియోజకవర్గం పడమట సెంటర్కి చేరుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మహిళలు గుమ్మడి కాయతో దిష్టి తీశారు. పూలు చల్లుతూ జగన్ మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు.
జగన్ పర్యటనపై ఆంక్షలు..
వైఎస్ జగన్ పర్యటనలో పోలీసులు ఆంక్షలు విధించారు. కేవలం 500 మంది, 10 వాహనాలకు మాత్రమే అనుతి ఇచ్చారు. అంతేకాదు.. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్.ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలకు ఎలాంటి అనుమతి లేదని ఆంక్షలు పెట్టారు. జగన్ పర్యటనకు రావొద్దని మాజీ ఎమ్మెల్యేలు, మండల, గ్రామ నాయకులకు నోటీసులు ఇచ్చారు.
జగన్ నుంచి జనాన్ని దూరం చేయలేరు: పేర్ని నాని
ఎన్ని ఆంక్షలు పెట్టినా జగన్ నుంచి జనాన్ని దూరం చేయలేరని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కూటమి ప్రభుత్వం ఆంక్షలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. భారీ వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ అంటూ పేర్ని ప్రశ్నించారు.
