YS Vimalamma
YS Vimalamma : వైఎస్ షర్మిల, సునీతా రెడ్డిలపై దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చెల్లెలు, సీఎం జగన్ మోహన్ రెడ్డి మేనత్త వైఎస్ విమలమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల, సునీత అన్యాయంగా మాట్లాడుతున్నారు.. వైఎస్ కుటుంబం పరువును రోడ్డుమీదకు తీసుకొస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేనుకూడా ఆ ఇంటి ఆడపడుచుగా ఇప్పుడు మాట్లాడుతున్నా.. అవినాశ్ రెడ్డి హత్య చేస్తుంటే షర్మిల, సునీతలు చూశారా? అంటూ విమలమ్మ ప్రశ్నించారు.
వైఎస్ వివేకాను చంపిన వాళ్లు బయట తిరుగుతున్నారు. మా ఇంట్లో వాళ్లిద్దరూ ఇలా తయారు అయ్యారని బాధగా ఉంది. ఏం సంబంధం లేని జగన్ మోహన్ రెడ్డిని కూడా దీంట్లోకి తీసుకొస్తున్నారంటూ విమలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల, సునీత వ్యక్తిగతంగా కక్ష్య పెట్టుకున్నారు. ఇప్పటికైనా ఇద్దరు అక్కాచెల్లెళ్లు నోరు మూసుకోండి.. వైఎస్ కుటుంబ సభ్యులు ఎవ్వరూ మీకు మద్దతు ఇవ్వరు.. గుర్తు పెట్టుకోండి అంటూ విమలమ్మ సూచించారు.
Also Read : Bhimavaram Assembly Constituency : గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఓడిన కాపుల కోటలో ఈసారి గెలుపెవరిది?
జగన్ మోహన్ రెడ్డి శత్రువులు అంతా షర్మిల చుట్టూ చేరారు. ఎంపీగా అవినాశ్ రెడ్డి కడపను అభివృద్ధి చేశారు. అవినాశ్ రెడ్డి ఒక్కమాట ఇప్పటి వరకు ఆ ఇద్దరినీ అనలేదు. వాళ్లకోసం ప్రార్దన చేస్తున్నా. ఇద్దరు నాశనం అవుతారు. మీకు దైవ భయం పోయింది. ఆస్తులు ఈడీ నుంచి రిలీజ్ అయిన తరువాత ఇస్తానని జగన్ షర్మిలకు చెప్పారని విమలమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు.