YSR Zero Interest : రైతులకు సీఎం జగన్ శుభవార్త

రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్‌లో వారి ఖాతాల్లో డబ్బులు వేయనుంది. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి అర్హత గల ప్రతి రైతుకు అక్టోబర్‌లో..

Ysr Zero Interest Subsidy

YSR Zero Interest Subsidy : రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్‌లో వారి ఖాతాల్లో డబ్బులు వేయనుంది. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి అర్హత గల ప్రతి రైతుకు అక్టోబర్‌లో వడ్డీ రాయితీ జమ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా సీజన్‌ ముగియకుండానే వడ్డీ రాయితీ జమ చేస్తూ అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది.

ఖరీఫ్-2020 సీజన్‌లో 86.17 లక్షల మంది రైతులకు రూ.1.47 లక్షల కోట్ల రుణాలిచ్చారు. వీరిలో రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న వారు కనీసం 20 లక్షల మందికి పైగా ఉంటారని అంచనా. వైఎస్సార్‌ సున్నా వడ్డీ రాయితీ పథకంపై రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు. పంట రుణాలను సకాలంలో చెల్లించే విధంగా రైతులకు వివరిస్తున్నారు. సాగు చేసిన పంట వివరాలను తప్పనిసరిగా ఈ-క్రాప్‌ బుకింగ్‌ చేయించారో, లేదో పరిశీలించనున్నారు. గడువు తేదీలోగా రుణాలు చెల్లించిన రైతుల జాబితాను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల వద్ద ప్రదర్శించనున్నారు. అర్హులైన రైతుల వివరాలను వైఎస్సార్‌ఎస్‌వీపీఆర్‌ పోర్టల్‌లో గడువు తేదీలోపు బ్యాంకులు అప్‌లోడ్‌ చేసేలా పర్యవేక్షిస్తారు.

ఖరీఫ్-2020 సీజన్‌లో రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకుని సెప్టెంబర్‌ నెలాఖరులోపు తిరిగి చెల్లించిన వారందరికీ 4 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. గడువులోగా వడ్డీతో సహా పంట రుణాన్ని చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు సమీప రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించాలి. ఈ పథకం నిబంధనల ప్రకారం పంట రుణాలపై 7 శాతం వడ్డీని బ్యాంకులు వసూలు చేస్తాయి. ఇందులో రైతులు తీసుకున్న పంట రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీని కేంద్రం భరిస్తోంది. మిగిలిన 4 శాతం వడ్డీని గతంలో రైతులే చెల్లించేవారు. ప్రస్తుతం దీన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది.

తీసుకున్న రుణ మొత్తాన్ని వాయిదాలతో సహా ఏడాదిలోపు తిరిగి చెల్లించిన రైతుల పొదుపు ఖాతాలకు ఈ వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా జమ చేస్తోంది. రూ.లక్ష వరకు పంట రుణాలు తీసుకుని ఏడాదిలోగా తిరిగి చెల్లించిన రైతులందరూ ఈ వడ్డీ రాయితీకి అర్హులు. ఏ పంటపై రుణం తీసుకున్నారో ఆ పంటను మాత్రమే సాగు చేయాల్సి ఉంటుంది. వారు వేసిన పంటను తప్పనిసరిగా ఈ-క్రాప్‌ బుకింగ్‌లో నమోదు చేయించుకుని ఉండాలి.

రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా వడ్డీలేని రుణాలు ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు.. సీఎం జగన్.. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం అమలు చేస్తున్నారు. ఈ స్కీమ్ కింద అర్హులైన అన్నదాతలకు వడ్డీ రాయితీ చెల్లిస్తున్నారు. పంటల సాగు కోసం రుణం తీసుకున్న రైతులకు వడ్డీ భారం తప్పించాలనే గొప్ప లక్ష్యంతో అధికారంలోకి రాగానే ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు’ పథకం ప్రకటించారు సీఎం జగన్. ఇందులో భాగంగానే బ్యాంకు నుంచి రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన రైతులందరికీ ప్రభుత్వం వడ్డీ రాయితీ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది.

దురదృష్టవశాత్తు విపత్తుల వల్ల పంట నష్టం వాటిల్లితే బాధిత రైతులకు అదే సీజన్‌లో పెట్టుబడి రాయితీ చెల్లించడం ద్వారా.. వచ్చే సీజన్‌లో పంటలు వేసుకునేందుకు బాసటగా నిలవాలన్నది సీఎం జగన్‌ ఆశయం. ఇందులో భాగంగానే రైతుల ఖాతాల్లో పెట్టుబడి రాయితీ జమ చేయనున్నారు.