టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ఆస్తులపై సీబీఐ,ఈడీతో విచారణ జరిపించాలంటూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగొయ్ కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. ఫెమా,మనీలాండరింగ్,ఐటీ నిబంధనలను రవిప్రకాష్ ఉల్లంఘిచారని విజయసాయిరెడ్డి ఆ లేఖలో తెలిపారు. రవిప్రకాష్ అక్రమంగా ఆస్తులను కూడబెట్టారని ఫిర్యాదు చేశారు. రవిప్రకాష్ హవాలా సొమ్ముతో ఉగాండా,కెన్యాలో పెట్టుబడులు పెట్టారని ఆ లేఖలో విజయసాయిరెడ్డి తెలిపారు రవిప్రకాష్ అవినీతి వ్యాపారాలు,పలు సంస్థల్లో పెట్టిన షేర్ల వివరాలు జతచేసి ఆధారాలతో సహా చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు.
అంతర్జాతీయ స్థాయిలో బ్యాంకుల ను మోసం చేసిన మొయిన్కురేషి,సీబీఐ కేసులో ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న సానా సతీష్ తో కలసి రవిప్రకాష్ చాలా మందిని మోసం చేసారని లేఖలో తెలిపారు. సానా సతీష్, మొయిన్ కురేషి,రవిప్రకాష్ ముగ్గురు కలసి నకిలీ డాక్యుమెంట్ లతో నగల వ్యాపారి సుఖేష్ గుప్తను బెదిరించి హవాలాకు పాల్పడ్డారని లేఖలో విజయసాయిరెడ్డి తెలిపారు.
రవిప్రకాశ్ ప్రస్తుతం టీవీ9లో రూ.18కోట్లు స్వాహా చేసిన కేసులో చంచల్గూడ జైలులో ఉన్నారు. శనివారం(అక్టోబర్ 5,2019) కోర్టు ఆయనకు అక్టోబర్ 18వ తేదీ వరకూ(14 రోజులు) జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయనను చంచల్ గూడ జైలుకి తరలించిన విషయం తెలిసిందే. రవిప్రకాశ్కు జైలు అధికారులు అండర్ ట్రయల్ ఖైదీ నెంబర్ 4412ను కేటాయించారు. కృష్ణా బ్యారక్లో రవి ప్రకాశ్ను ఉంచారు.