Amazon And Flipkart: ఎలాంటి అనుమతి లేకుండానే ఔషధాలు విక్రయిస్తున్న అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్లస్ వంటి ఆన్లైన్ సంస్థలకు కేంద్రం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) వీజీ సోమాని ఈ నోటీసులు జారీ చేశారు.
అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్లస్ సంస్థలతోపాటు మొత్తం 20 ఆన్లైన్ సంస్థలకు ఈ నెల 8న షోకాజ్ నోటీసులు జారీ చేసింది డీసీజీఐ. డిసెంబర్ 12, 2018 నాటి హైకోర్ట్ ఆర్డర్ ప్రకారం ఇలా అనుమతులు లేకుండా ఔషధాలు విక్రయించడం నిబంధనలను ఉల్లంఘించడమే. ఈ చట్టానికి సంబంధించి డీసీజీఐ 2019లోనే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలు జారీ చేసింది. దీని ప్రకారం లైసెన్స్ లేకుండా ఎవరూ ఔషధాలు విక్రయించడానికి వీల్లేదు. అలాగే డ్రగ్స్ నిల్వ చేయడం, విక్రయించడం, ప్రదర్శించడం, ఆఫర్లు ప్రకటించడం, పంపిణీ చేయడం వంటివి నేరంగానే పరిగణిస్తారు.
Turkey Syria Earthquake : చిగురిస్తున్న ఆశలు.. టర్కీ, సిరియాలో సహాయక చర్యలు వేగవంతం
దీంతో లైసెన్స్ లేకుండా ఔషధాలు విక్రయించిన సంస్థలకు డీసీజీఐ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీనికి రెండు రోజుల్లోగా సమాధానం చెప్పాలని ఆయా కంపెనీలను ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలని ఆదేశించింది. సరైన సమాధానం రాకపోయినా లేదా సమాధానం చెప్పకపోయినా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయా కంపెనీలను హెచ్చరించింది. నోటీసుల విషయాన్ని ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు కూడా ధృవీకరించాయి.