IBM కొత్త సీఈఓగా అరవింద్ కృష్ణ

  • Publish Date - January 31, 2020 / 10:49 AM IST

భారతీయ సంతతికి చెందిన అరవింద్ కృష్టను ఐబీఎం కంపెనీ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించనుంది. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఐబీఎం కంపెనీ కొత్త సీఈఓగా అరవింద్ కృష్ణ ఏప్రిల్ నుంచి బాధ్యతలు స్వీకరించనునట్లు ప్రస్తుత సీఈఓ గిన్నీ రొమెట్టి తెలిపింది. బోర్డు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఈ ఏడాది చవరివరకు తాను బాధ్యతలు నిర్వహిస్తుంటానని గిన్నీ రొమెట్టీ తెలిపింది

ప్రస్తుతం అరవింద్ ఐబీఎం వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, క్లౌడ్‌ అండ్ కాగ్నిటివ్ కంప్యూటింగ్‌, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ తయారీలో అరవింద్‌ బాగా కృషి చేశారు. వీటి కంటే ముందు సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ జనరల్ మేనేజర్ గా బాధ్యతలు చేపట్టారు. అంతకంటే ముందు ఐబీఎం డేటాకు సంబంధించిన బిజినెస్ ను చూసుకునేవారు.

అరవింద్ కృష్ణ 1990లో ఐబీఎంలో చేరారు. కాన్పూర్ ఐఐటీలో కృష్ణ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇల్లినాయిస్ యూనీవర్శీటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పీహెచ్ డీని పూర్తి చేశారు. అరవింద్ కృష్ణ మాట్లాడుతూ తనని ఐబీఎం కంపెనీ తదుపరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఎన్నుకోవటం తనకి ఎంతో ఆనందంగా కలిగించిందని ఈ సందర్భంగా అరవింద్ కృష్ణ అన్నారు. 

బోర్డు మెంబర్లు, ప్రస్తుత సీఈఓ గిన్నీ రొమెట్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆయన తెలిపారు. సత్యనాదెళ్ల, సుందర్ పిచాయ్ ల వంటి వాళ్ల జాబితాలో మల్టీ నేషనల్ కంపెనీలకు సీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తున్న భారతీయ వ్యక్తిగా అరవింద్ కృష్ణ గుర్తింపు పొందారు.