చేపల కోసం రెండు గ్రామాల మధ్య ఘర్షణ : రాళ్లు, కర్రలతో పరస్పర దాడి
- veegam team
- Published On : April 13, 2019 / 02:58 PM IST
వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలో రెండు గ్రామాల మధ్య ఘర్షణ నెలకొంది. కనగర్తిలో చెరువులో చేపలు పట్టుకునే విషయంలో రెండు గ్రామాల మధ్య గొడవ జరిగింది. అనుమతి లేకుండా చేపలు పడుతున్నారంటూ కనగర్తి గ్రామస్తులపై గుండేడు గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి.
చెరువు వివాదంలో కొంతకాలంగా రెండు గ్రామాల మధ్య వివాదం కొనసాగుతోంది. చెరువులో చేపలు పట్టేందుకు గుండేడు గ్రామస్తులు వచ్చారు. కనగర్తి గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. తీవ్ర గాయాలై రక్తస్రావం అవుతున్నా.. ఒకరిపైమరొకరు దాడి చేసుకున్నారు. ఇరు గ్రామాలకు చెందిన 200 మంది సరస్పరం దాడి చేసుకున్నారు. పలువురికి గాయాలు అయ్యాయి. బైకులు దగ్ధం అయ్యాయి. క్షతగాత్రులను వరంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేసినప్పటికీ చెరువులో తమ వాటా కావాలని ఇరువురూ గొడవ చేస్తున్నారు. చేపలు పట్టే హక్కు తమకే ఉందని గుండేడు గ్రామస్తులు చెప్తుండగా..చెరువు తమదని కనగర్తి గ్రామస్తులు అంటున్నారు. రెండు గ్రామాల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. రెండు గ్రామస్తుల పెద్దలతో చర్చలు కొనసాగిస్తున్నారు.
