Cyber Crime
Cyber Crimes: సైబర్ క్రైమ్ లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. టార్గెట్ చేసి ఏదో ఒక రకంగా బురిడీ కొట్టించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో వయస్సుతో సంబంధం లేకుండా నేరాలకు ఒడిగడుతున్నారు. బాధితులు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు ఫైల్ అయింది. నగరానికి చెందిన ఓ వ్యక్తిని టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఉద్యోగుల మాదిరిగా నటించారు.
కేవైసీ అప్డేట్ పేరుతో డెబిట్ కార్డుకు సంబంధించిన వివరాలు సేకరించారు. ఓటీపీల కోసం నేరగాళ్లు కాల్ చేసే సమయానికి తన ఫోన్ ఇంట్లో వదిలి బయటకు వెళ్లారు. అదే సమయంలో ఐదో తరగతి ఆన్లైన్ క్లాస్లు వింటోన్న అతని కూతురు కాల్ అందుకుంది. ‘అంకుల్ డాడీ లేరు… బయటకి వెళ్లారు..’ అని చెప్పి ఫోన్ కట్ చేయడానికి ప్రయత్నించింది.
ఈ లోపు అటు నుంచి ‘తెలుసమ్మా… ఫోన్కు ఓటీపీలు వస్తాయి చెప్పమ్మా’ అంటూ హిందీలో సంభాషించారు. అలా రెండుసార్లు ఆమె నుంచి ఓటీపీలు తీసుకుని బ్యాంకు ఖాతా నుంచి రూ.32 వేలు చోరీ చేసేశారు. బ్యాంకు అధికారుల మాదిరిగానే మూసారాంబాగ్కు చెందిన వ్యక్తికి కాల్ చేసి రూ.1.15 లక్షలు కాజేశారు.
వివిధ కారణాలతో కొన్ని సంస్థల కస్టమర్ కేర్ నెంబర్ల కోసం ప్రయత్నించిన ఇద్దరు నగర వాసులు ఇంటర్నెట్లో ఉన్న నకిలీ నెంబర్లకు కాల్ చేసి చెప్పినట్లే చేయడంతో తమ ఖాతాల్లోని రూ.81 వేలు, రూ.96 వేలు పోగొట్టుకున్నారు. మరో ఉదంతంలో OLXలో ఉన్న వెహికల్ సేల్ యాడ్ చూసిన నగర వాసి అందులోని నెంబర్లకు సంప్రదించాడు. ఆర్మీ ఆఫీసర్గా చెప్పుకుని సైబర్ అడ్వాన్స్ సహా వివిధ పేర్లతో రూ.4 లక్షలు కాజేశాడు సైబర్ నేరస్థుడు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.