Fire Accident : విశాఖ హెచ్.పీ.సీ.ఎల్ లో భారీ అగ్నిప్రమాదం
- murthy
- Published On : May 25, 2021 / 04:01 PM IST
Fire Accident
Fire Accident : విశాఖలోని హెచ్.పీ.సీ.ఎల్. పరిశ్రమలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కొత్తగా నిర్మిస్తున్న చిమ్నీలో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు అలుముకున్నాయి. పరిశ్రమనుంచి భారీ శబ్దాలు రావటంతో స్ధానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 100 మంది దాకా ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. వారందరినీ ప్రమాద హెచ్చరిక సైరన్ మోగించి బయటకు పంపించినట్లు తెలిసింది. విశాఖ పారిశ్రామికవాడలోని హిందూస్ధాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ కు చెందిన ఓల్డ్ టెర్మినల్ లో మంగళవారం ధ్యాహ్నం 3 గంటలసమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద ఘటనతో సమీపంలోని ఉన్న గాజువాక ఆటోనగర్ ప్రాంతం, మల్కాపురం,శ్రీహరి పురంలోని ప్రజలు భయాందోళనలతో ఇళ్లనుంచి బయటకు వచ్చారు.
సమచారం తెలుసుకున్న మల్కాపురం పోలీసులతో సహా పారిశ్రామికవాడలోని పలు ఫైరింజన్లు కూడా అక్కడకు చేరుకున్నాయి. దాదాపు గంటన్నర పాటుశ్రమించి మంటలను అదుపులోకితెచ్చాయి. పరిశ్రమలో అత్యవసరమైన అగ్నిమాపక శకటం కూడా ఉంది. ఫోమ్ తరహా పదార్ధంతో అధికారులు మంటలను అదుపుచేసారు. హెచ్.పీ.సీ.ఎల్. కు సంబంధించి విశాఖపట్నంలోఆరు రిఫైనరీలు ఉన్నాయి. ఇప్పడు మల్కాపురం ప్రాంతంలో ఉన్నరిఫైనరీలో ఈ ప్రమాదం జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ అమలవుతుండటంతో కొంతమంది కాంట్రాక్ట్ కార్మికులతో హెచ్పీసీఎల్ కు చెందిన అధికారులు పనిచేయిస్తున్నట్లు తెలిసింది. హెచ్.పీ.సీ.ఎల్. లో కొంతకాలంగా విస్తరణ పనులు జరుగుతున్నాయి. బెంగాల్, బీహార్ కు చెందిన కాంట్రాక్టు కార్మికుల సహకారంతో అక్కడ పనులు నిర్వహిస్తునట్లు తెలిసింది. గతేడాది కూడా హెచ్పీసీఎల్ లో అగ్నిప్రమాదం సంభవించింది. అప్పడు స్వల్ప ప్రమాదం సంభవించటంతో ప్రాణ నష్టం సంభవించలేదు.
ఈరోజు మధ్యహ్నం ప్రమాదాన్ని పసిగట్టిన కార్మికులందరం బయటకు వచ్చిప్రాణాలు దక్కించుకున్నామని కార్మికులు చెప్పారు. గంటన్నర సమయంలో మంటలను అదుపులోకి వచ్చాయి. హెచ్పీసీఎల్ లో అగ్నిప్రమాదం సంభవించగానే చుట్టుపక్కల పరిశ్రమల్లో ఉన్న అగ్నిమాపక శకటాలన్నీ అక్కడకు చేరుకున్నాయి. నేవీకూడా రంగంలోకి దిగి మంటలను అదుపుచేసేందుకు కృషి చేసింది. ఈప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటిప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. ఆర్డీవో స్ధాయి అధికారి అక్కడకు చేరుకుని విచారణ చేస్తున్నారు.
