మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. వివాహేతర సంబంధాలు, ప్రేమ మైకం.. మర్డర్లకు దారితీస్తున్నాయి. అక్రమ సంబంధం కోసం కొందరు మహిళలు కట్టుకున్న భర్తలను
మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. వివాహేతర సంబంధాలు, ప్రేమ మైకం.. మర్డర్లకు దారితీస్తున్నాయి. పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. అక్రమ సంబంధం కోసం కొందరు మహిళలు కట్టుకున్న భర్తలను కడతేరుస్తున్నారు. ఇక యువత కూడా దారి తప్పుతోంది. వావి వరుసలు మరిచి ప్రేమమైకంలో కళ్లు మూసుకుపోయి ఓ చెల్లెలు సొంత అక్కనే ప్రియుడితో కలసి అంతం చేసింది. వరుసకు అన్న అయ్యే వ్యక్తితో ప్రేమకి ఒప్పుకోలేదని అక్కను అతి దారుణంగా చంపేసింది ఆ చెల్లెలు. ఈ సంఘటన తమిళనాడులోని నామక్కల్లో సమీపంలో జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కను హతమార్చిన చెల్లెలు, ఆమె ప్రియుడిని పోలీసులు సోమవారం(ఏప్రిల్ 6,2020) అరెస్టు చేశారు.
రక్తపు మడుగులో మోనిషా:
కోసవంపట్టి దేవేంద్రపురానికి చెందిన శంకరన్కు ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు మోనిషా(18) నామక్కల్లో ఇంజినీరింగ్ సెకండియర్ చదువుతోంది. ఏప్రిల్ 5న ఇంట్లో తల్లిదండ్రులు బయటకు వెళ్లడంతో మోనిషా ఒంటరిగా ఉంది. వారు ఇంటికి వచ్చి చూసి షాక్ తిన్నారు. మోనిషా రక్తపు మడుగులో పడి ఉంది. మోనిషా ఎడమచేతి మణికట్టు కోసుకున్న స్థితిలో తీవ్ర రక్తస్రావంతో కనిపించింది.
పోస్టుమార్టంలో వెలుగుచూసిన దారుణం:
దీంతో తల్లిదండ్రులు మోనిషాను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. అయితే ఆత్మహత్య చేసుకునేంత కష్టాలు తమ కూతురికి లేవని తల్లిదండ్రులు పోలీసులతో చెప్పారు. ప్రేమ వ్యవహారం కూడా లేదన్నారు. దీనిపై తల్లిదండ్రులకు అనుమానం కలిగింది. వారు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసుల్లోనూ సందేహాలు మొదలయ్యాయి. మోనిషా మృతదేహాన్ని మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహిచారు. పోస్టుమార్టం రిపోర్టులో ఆమెను గొంతు నులిమి చంపేశారని, ఆ తర్వాత ఎడమ చేతిని కత్తితో కోశారని పోలీసులకు తెలిసింది.
వరుసకు అన్న అయ్యేవాడితో ప్రేమ ఏంటని మందలింపు:
దీన్ని హత్యకేసుగా మార్చిన పోలీసులు కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులందరినీ ప్రశ్నించారు. విచారణలో మోనిషా చెల్లెలు(17) తడబడుతూ సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో ఆమె వ్యవహారశైలిపై లోతుగా విచారించగా అసలు నిజం బయటపడింది. మోనిషా చెల్లెలు బంధువుల అబ్బాయి రాహుల్(19) ని ప్రేమించింది. ఈ విషయం తెలిసిన మోనిషా.. వరుసకు అన్నయ్య అయ్యే వ్యక్తితో ప్రేమ ఏంటని చెల్లిని నిలదీసింది. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించింది. అయినా మాట వినకపోవడంతో విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది మోనిషా. అతడు అన్న వరుస కావడంతో తల్లిదండ్రులు కూడా వారి ప్రేమను నిరాకరించారు. ఈ వ్యవహారంతో కొద్దిరోజులుగా వారి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి.
హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం:
అక్క కారణంగానే తన ప్రేమను తల్లిదండ్రులు తిరస్కరించారని మోనిషాపై చెల్లెలు కక్ష పెంచుకుంది. అక్కను చంపేయాలని నిర్ణయించుకుంది. ఏప్రిల్ 5న మోనిషా ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ప్రియుడిని రప్పించింది. ఇద్దరూ కలిసి మోనిషా గొంతు నులిమి దారుణంగా చంపేశారు. నేరం బయట పడకుండా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చేతి మణికట్టును కత్తితో కట్ చేశారు. కత్తిని చేతిలోనే ఉంచారు. పోస్టుమార్టం రిపోర్టులో అసలు నిజం వెల్లడి కావడంతో మోనిషా చెల్లెలి బండారం బట్టబయలైంది. మోనిషా చెల్లెలు, ఆమె ప్రియుడు రాహుల్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపారు.
Also Read | ఎలా ముందుకెళ్దాం…పార్లమెంటరీపక్ష నాయకులతో ప్రధాని వీడియోకాన్ఫరెన్స్