Tirumala High Alert : హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలలో ఒక్కసారిగా కలకలం రేగింది. తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ-మెయిల్ ద్వారా తిరుమల పోలీసులకు గుర్తుతెలియని వ్యక్తులు ఈ సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. శ్రీవారి ఆలయ పరిసరాలు, మాడవీధుల్లో టీటీడీ విజిలెన్స్, పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు.
దీనిపై తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి స్పందించారు. తిరుమల కొండపై ఉగ్రవాదులు ఉండవచ్చు, తనిఖీలు చేయండి అంటూ ఒక ఈ-మెయిల్ వచ్చిందని ఆయన తెలిపారు. ఆ ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది వెరిఫై చేస్తున్నామన్నారు. కాగా, అధికారికంగా తిరుమలలో ఎలాంటి హై అలెర్ట్ లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రస్తుతం కొండపై తనిఖీలు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.