శోభనం రోజే భార్యను దారుణంగా హత్య చేసి భర్త ఆత్మహత్య 

Husband Brutally Murdered His Wife And He Commits Suicide First Night 3706

తమిళనాడులో దారుణం జరిగింది. శోభనం రోజే భార్యను అత్యంత దారుణంగా హత్య చేసి.. భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తిరువల్లూరు జిల్లా మింజూర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం నీతావసన్‌(24), సంధ్య(20) దగ్గరి బంధువులు. వీరిద్దరికి బుధవారం (జూన్ 10, 2020) ఉదయం వివాహం జరిగింది.

అదే రోజు రాత్రి నూతన దంపతులకు శోభనం ఏర్పాటు చేశారు. ఎన్నో ఆశలతో భార్య శోభనం గదిలోకి అడుగుపెట్టింది. సుఖ, సంతోషాలతో గడపాల్సిన ఆ సమయంలో భార్యతో భర్త ఘర్షణ పడ్డాడు. తొలి రాత్రి గదిలో దంపతుల మధ్య తలెత్తిన వివాదం హత్య దాకా దారి తీసింది. ఆవేశంలో భర్త.. భార్యను గునపంతో పొడిచి చంపాడు.

అనంతరం ఇంటికి సమీపంలోని చెట్టుకు భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇరువురి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.