హైదరాబాద్ : వ్యాపారవేత్త జయరాం మర్డర్ కేసులో విచారణకు హైదరాబాద్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఏపీ పోలీసుల నుంచి ఈ కేసు తెలంగాణ పోలీసులకు ట్రాన్సఫర్ అయింది.
హైదరాబాద్ : వ్యాపారవేత్త జయరాం మర్డర్ కేసులో విచారణకు హైదరాబాద్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఏపీ పోలీసుల నుంచి ఈ కేసు తెలంగాణ పోలీసులకు ట్రాన్సఫర్ అయింది. దీంతో ఎంక్వైరీ చేసేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రిపేర్ అయ్యారు. ఈ కేసులో మొత్తం ఎంతమందిని విచారించాలి, ఎవరెవరికి నోటీసులు ఇవ్వాలి, అన్న దానిపై బంజారాహిల్స్ పోలీసులు లిస్టు తయారు చేస్తున్నారు. కాగా, జయరాం మేనకోడలు శ్రిఖా చౌదరిని ఫిబ్రవరి 11వ తేదీ సోమవవారం విచారించాలని పోలీసులు నిర్ణయించారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి పోలీసులు రాకేష్ ఇంటికి వెళ్లనున్నారు. ఆరోపణల నేపథ్యంలో ఏసీపీ మల్లారెడ్డి, సీఐ శ్రీనివాస్ విచారణపై ఉత్కంఠ నెలకొంది.
జయరాం హత్య కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. నిందితులను రక్షించేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారని, వారిపై తమకు నమ్మకం లేదని జయరాం భార్య పద్మశ్రీ ఆరోపించిన విషయం తెలిసిందే. తన భర్త హత్యపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్తను హైదరాబాద్లో హత్యచేసి మృతదేహాన్ని ఏపీలోకి తీసుకెళ్లడం ద్వారా కేసును పరిధి దాటించారని పద్మశ్రీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసును తెలంగాణ పోలీసులు విచారించాలని, ఏపీ పోలీసులను శ్రిఖా చౌదరి ప్రభావితం చేసి ఉండొచ్చని.. ఈ కేసులో తనకు చాలా అనుమానాలు ఉన్నాయని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జయరాం హత్య తెలంగాణ పరిధిలోనే జరిగింది కాబట్టి ఈ కేసును అక్కడికే బదిలీ చేయాలని చట్టప్రకారం నిర్ణయించారు. దీంతో కేసును తెలంగాణకు బదిలీ చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు రాకేశ్ రెడ్డి, వాచ్మెన్ శ్రీనివాస్లను హైదరాబాద్ పోలీసులు మరోసారి విచారించనున్నారు.