Kathi Mahesh Passed Away In Chennai Apollo Hospital
Kathi Mahesh Passed Away : నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీనటుడు, ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ కన్ను మూశారు. జూన్ 26వ తేదీన నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న ఆయన కారు, ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీ కొట్టింది.
ఈప్రమాదంలో ఆయన తల ముక్కు,కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను నెల్లూరులోని మెడికవర్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం చెన్నై లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం ఆయన తుది శ్వాస విడిచారు.
ఈ రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటంతో తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నా ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. కత్తి మహేష్కు మెరుగైన వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 17లక్షల రూపాయల భారీ ఆర్ధిక సాయం అందచేసింది. రెండు వారాలుగా చెన్నై లోని అపోలోలో చికిత్స పొందుతున్న కత్తి మహేష్ ఆరోగ్యం విషమించటంతో శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు ప్రకటించారు.