Siddipet District : భార్య ప్రవర్తనపై.. అనుమానం మొగుడు పెట్టే హింస భరించలేని ఇల్లాలు రెండేళ్లు కుమారుడికి నిప్పంటించి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన సిధ్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కొండపాక మండలం సిర్సనగండ్ల గ్రామంలోని స్వామి అనే వ్యక్తికి చేర్యాల మండలం వేచరేణికి చెందిన పోశయ్య, మల్లవ్వల చిన్న కుమార్తె నవితతో 10 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. వీరికి మణిదీప్(2) అనే కుమారుడు ఉన్నాడు.
స్వామి వ్యవసాయ పనులతో పాటు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్నాళ్లుగా స్వామికి భార్య నవిత ప్రవర్తనపై అనుమానం కలిగింది. నవితకు ఆమె అన్నతో వివాహేతర సంబంధం ఉందనే కారణంతో ఆమెను వేధించసాగాడు. ఈ విషయమై ఇంట్లో భార్యా భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. వారం రోజుల క్రితం కుల పెద్దలు ఇద్దరికీ పంచాయతీ చేసి నచ్చ చెప్పారు.
శనివారం పొద్దున్న చేనులో పత్తి ఏరెందుకు రమ్మనమని స్వామి భార్యను కోరాడు. ఆమె రానని చెప్పటంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో భార్యపై చేయి చేసుకుని స్వామి వ్యవసాయ బావి వద్దకు వెళ్లిపోయాడు. భర్త చేయి చేసుకోవటంతో మనస్తాపం చెందిన నవిత మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమారుడు మణిదీప్ పై పెట్రోల్ పోసి నిప్పంటించి తానుకూడా నిప్పంటించుకుంది.
Also Read : Nikhil Siddhartha : ఏపీలో థియేటర్ల పరిస్థితిపై గళమెత్తిన మరో యంగ్ హీరో..
ఇంట్లోంచి పొగలు రావటం గమనించిన ఇరుగు పొరుగు వారు తలుపులు పగల గొట్టి చూడగా ఇద్దరూ విగతజీవులై కనిపించారు. తమ కూతురిపై లేనిపోని అభాండాలు వేసి వేధించి చంపారని మృతురాలి తల్లి తండ్రులు ఆరోపించారు. తమ కూతురు మృతికి అత్త బీరవ్వ, బావ భాస్కర్, భర్త స్వామిలే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.