నన్ను పంపండి.. ఉరి తీస్తా: తమిళనాడు పోలీస్

నిర్భయ దోషులను ఉరి తీసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తమిళనాడు పోలీస్ అంటున్నాడు. తీహార్ జైలులో తలారి(ఉరి తీసే వ్యక్తి) అందుబాటులో లేడంటూ వార్తలు రావడంతో హెడ్ కానిస్టేబుల్ సుభాష్ శ్రీనివాసన్ సిద్ధమయ్యాడు. తాత్కాలిక తలారిగా నియమించాలంటూ ఆ పని చేసేందుకు రెడీగా ఉన్నానని తీహార్‌ జైలు డీజీపీకి లేఖ రాశారు. నిర్భయ దోషులను ఉరితీసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు ఈ పనికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 

‘మీరు నాకు అప్పగించబోయే పని ఎంతో గొప్పది. కాబట్టి అక్కడ పనిచేసే అవకాశం ఇవ్వగలరని కోరుతున్నా’ అని లేఖలో పేర్కొన్నారు. కాగా సుభాష్‌ శ్రీనివాసన్‌ వార్తల్లో నిలవడం మొదటిసారేం కాదు. అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించడం, మంచి నీటి ఉచిత సరఫరా వంటి పలు సామాజిక కార్యక్రమాల్లో ఆయన భాగస్వామ్యమయ్యారు.
 
దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ ఘటన దోషులకు సుప్రీంకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. ఘటన జరిగి ఏడేళ్లు గడుస్తున్నా అమలు కాకపోవడంపై పలువురు ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉరిశిక్ష అమలుకై తీహార్‌ జైలు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. తలారి లేరని చెబుతున్నట్లు వార్తలు వస్తుండటంతో తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరాడు. 

2012, డిసెంబర్ 16వ తేదీ రాత్రి 23 ఏళ్ల విద్యార్థినిపై ఢిల్లీలో ఆరుగురు లైంగిక దాడికి పాల్పడి, ఆమెతో పాటు స్నేహితుడిని రోడ్డు మీదకు విసిరేశారు. ప్రాణాల కోసం పోరాడి చివరకు ఆ యువతి కన్నుమూసింది. ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రామ్ సింగ్ తీహార్ జైల్లో 2013 మార్చిలో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత విడుదలయ్యాడు. మిగిలిన నలుగురు నిందితులు అక్షయ్‌, వినయ్‌ శర్మ, పవన్‌, ముఖేశ్‌లకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.