AP DSC certificates Verification : ఏపీలో డీఎస్సీ పాస్ అయిన అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీ వచ్చేసింది..
ఏపీ మెగా డీఎస్సీ (AP DSC certificates Verification) ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. తాజాగా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను..
- Harishth Thanniru
- Published On : August 19, 2025 / 12:29 PM IST
AP Mega DSC
AP DSC certificates Verification : ఏపీ మెగా డీఎస్సీ ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. ఇప్పటికే స్కోర్ కార్డులు అందుబాటులోకి రాగా.. తాజాగా విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మెగా డీఎస్సీలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియకు సంబంధించి తేదీలపై పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది.
ఏపీ మెగా డీఎస్సీ (AP Mega DSC)లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికెట్ల ప్రక్రియను ఈనెల 21, 22 తేదీల్లో ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. రాత పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థుల సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేస్తారు. ఇటీవల డీఎస్సీ ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ.. మార్కుల సవరణకు ఆదివారం వరకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఆన్లైన్లో నమోదు చేసిన టెట్ మార్కులను పరిశీలించి, అనంతరం స్కోర్ కార్డులను విడుదల చేసింది.
గతంలో మాదిరిగా కాకుండా ఈసారి కొన్ని మార్పులు తీసుకురానున్నారు. ఈ క్రమంలో గతంలో ఇచ్చినట్లు డీఎస్సీలో టాపర్లు, కటాఫ్ మార్కులు, మెరిట్ లిస్టులు ఇవ్వకుండా నేరుగా సర్టిఫికెట్ల పరిశీలన (AP DSC certificates Verification) చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించి, సర్టిఫికెట్ల పరిశీలనకు అభ్యర్థులను ఆహ్వానిస్తారు. పరిశీలన అనంతరం తుది జాబితాను రూపొందిస్తారు. సెప్టెంబర్ నెల మొదటి వారంలోపు జాబితాలను సిద్ధం చేయనున్నారు. రెండో వారంలో పోస్టింగ్ లు ఇవ్వాలని భావిస్తున్నారు.
ఏపీలో మెగా డీఎస్సీకి సంబంధించి మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిపికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. మొత్తంగా 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ 6 నుంచి జులై 2వ తేదీ వరకు 23రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. అయితే, ఈ మెగా డీఎస్సీ పరీక్షలకు 92.90శాతం హాజరయ్యారు.
