రైల్వేలో ఉద్యోగాల జాతర.. 50,000 పోస్టుల భర్తీకి ప్రక్రియ.. ఇప్పటికే 9,000 నియామకాలు

రిక్రూట్‌మెంట్ ప్రక్రియను మరింత వేగవంతం చేయనుంది. రైల్వే కొలువు సాధించాలని కలలు కంటున్న అభ్యర్థులకు ఇది నిజంగా ఒక సువర్ణావకాశం.

Railway jobs

ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న లక్షలాది మంది నిరుద్యోగులకు భారతీయ రైల్వే శుభవార్త అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 50,000 మందికి పైగా అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూన్) 9,000 నియామకాలు పూర్తి చేసిన రైల్వే.. రాబోయే రోజుల్లో రిక్రూట్‌మెంట్ ప్రక్రియను మరింత వేగవంతం చేయనుంది.

భారీ రిక్రూట్‌మెంట్‌
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBs) ఇప్పటికే నియామక ప్రక్రియను ముమ్మరం చేశాయి. 2024 నవంబర్ నుంచి ఇప్పటివరకు, వివిధ నోటిఫికేషన్లలోని 55,197 ఖాళీల భర్తీ కోసం దాదాపు 1.86 కోట్ల మంది అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBTs) నిర్వహించాయి. 2024 వార్షిక క్యాలెండర్ ప్రకారం.. రైల్వే ఇప్పటికే 1,08,324 ఖాళీల భర్తీకి 12 నోటిఫికేషన్లు విడుదల చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో కూడా మరో 50,000 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు రైల్వే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నియామక ప్రక్రియలో అభ్యర్థుల సౌకర్యాలకు, పరీక్షల పారదర్శకతకు రైల్వే పెద్దపీట వేస్తోంది. మహిళలు, దివ్యాంగులైన (PwBD) అభ్యర్థులు ఇబ్బంది పడకుండా, వారి నివాస ప్రాంతాలకు సమీపంలోనే పరీక్షా కేంద్రాలను కేటాయించారు.

అభ్యర్థుల గుర్తింపు కోసం, దేశంలోనే తొలిసారిగా భారీ స్థాయిలో ఆధార్ ఆధారిత E-KYC విధానాన్ని 95% విజయవంతంగా అమలు చేశారు. పరీక్షల్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా మోసాలు జరగకుండా, అన్ని పరీక్షా కేంద్రాలలో సెల్ ఫోన్ జామర్లను ఏర్పాటు చేశారు.

రైల్వే శాఖ తీసుకుంటున్న ఈ చర్యలు నియామక ప్రక్రియపై అభ్యర్థుల్లో నమ్మకాన్ని పెంచుతున్నాయి. పటిష్ఠమైన ప్రణాళికతో, పారదర్శకమైన విధానాలతో లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు భారతీయ రైల్వే సిద్ధంగా ఉంది. రైల్వే కొలువు సాధించాలని కలలు కంటున్న అభ్యర్థులకు ఇది నిజంగా ఒక సువర్ణావకాశం.