కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్, కాంట్రాక్ట్) పోస్టుల భర్తీకి సెప్టెంబరు 23 నుంచి 27 వరకు పేపర్ 1 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే గురువారం (డిసెంబర్ 12, 2019)న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూనియర్ ఇంజినీర్ పేపర్ 1 పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు.
ఇక దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 3.77 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాగా.. 1,919 మంది అభ్యర్థులు మాత్రమే పేపర్ 2 పరీక్షకు అర్హత సాధించారు. షెడ్యూలు ప్రకారం పేపర్ 1లో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబరు 29న పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నారు.
పేపర్ 2 పరీక్ష విధానం:
> పేపర్ 2 పరీక్ష మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు.
> సంబంధిత బ్రాంచ్ లో డిప్లొమా, ఇంజినీరింగ్ సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
> అభ్యర్థులు ఏదో ఒక విభాగంలో (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్) పరీక్ష రాయాల్సి ఉంటుంది.
> పరీక్ష సమయం 2 గంటలు. నెగెటివ్ మార్కులు ఉండవు.
> పేపర్ 2 పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో కాకుండా ప్రతి ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది.