Rajasthan Politics: కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అకోశ్ గెహ్లాట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీధి కుక్కల కంటే దారుణంగా రోడ్లపై ఈడీ తిరుగుతోందంటూ ఆయన విమర్శలు గుప్పించారు. తన కుమారుడికి ఈడీ నుంచి సమన్లు అందడమే కాకుండా, కాంగ్రెస్ నాయకుల కార్యాలయాలపై ఈడీ దాడులు నిర్వహించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ‘‘దేశంలో వీధి కుక్కల కంటే ఎక్కువగా ఈడీ తిరుగుతోందని చెప్పాల్సి రావడం దురదృష్టకరం. ఏ దేశానికైనా ఇంతకంటే పెద్ద దౌర్భాగ్యం ఏముంటుంది? 76 ఏళ్లుగా దేశాన్ని కాంగ్రెస్ సమైక్యంగా ఉంచింది. అందు కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అమరులయ్యారు’’ అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ “పాకిస్థాన్ను రెండు ముక్కలు చేసి బంగ్లాదేశ్ సృష్టించింది కాంగ్రెస్. కానీ ఇంతమంది (బీజేపీ) ఈరోజు ఇందిరాగాంధీ పేరు ఎత్తడం లేదు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారి పేర్లను మీరు చరిత్ర నుంచి తుడిచివేస్తున్నారు. కానీ అది జరగదని గుర్తు పెట్టుకోండి’’ అని అన్నారు.
ప్రశ్నాపత్రం లీక్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జైపూర్లోని రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా, సికార్లోని ప్రాంగణాలపై గురువారం ఈడీ దాడి చేసిన సమయంలో అశోక్ గెహ్లాట్ ఇలా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, విదేశీ మారకద్రవ్య ఉల్లంఘన కేసులో గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్కు సమన్లు అందాయి. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై ఈడీని ప్రయోగిస్తున్నాయని గెహ్లాట్ అన్నారు. ఇక ఎన్నికల్లో బీజేపీ తన ఎన్నికల గుర్తుగా ఐటీ, ఈడీలను ఎంచుకోవాలని గెహ్లాట్ అన్నారు.