తన మాజీ సహచర మంత్రి హరీశ్ రావు మీద భారతీయ జనతా పార్టీ నేత ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాదని నిర్ణయం తీసుకునే దమ్ము ఉందా అంటూ హరీశ్ రావుకు ఆయన సవాలు విసిరారు. నిజానికి తెలంగాణ మంత్రివర్గంలో ఉన్నవారంతా కేసీఆర్ కు బానిసలేనని.. కేసీఆర్, కేటీఆర్ తప్ప మరెవరికీ నిర్ణయాధికారం ఉండదని విమర్శించారు. కేసీఆర్ అనుమతి లేకుండా చీమైనా చిటుక్కుమనదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సిద్దిపేట జిల్లాలోని కుకునూర్ పల్లి మండలం లకుడారంలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇక కేసీఆర్, కేటీఆర్ మీద సైతం ఈటల విరుచుకుపడ్డారు. కొడుకును (కేటీఆర్) ముఖ్యమంత్రి చేసేందుకే తనను కేసీఆర్ బయటకు పంపించారని ఆయన ఆరోపించారు. అధికారం కోసం కేసీఆర్ ఏమైనా చేయగలరంటూ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఈసారి గజ్వేల్ లో ఓడిపోవడం ఖాయమన్నారు. తాను ఏనాడూ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టలేదని, తాను ఎవరినీ మోసం చేయలేదని, తనపై అవాకులు చెవాకులు పేలితే ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. తనను రాజకీయంగా అంతం చేయాలనుకున్న కేసీఆర్ చివరకు తన పతనానికి తానే కారకుడు కాబోతున్నారని, ఇది చరిత్ర చెప్పిన సత్యమని ఈటల అన్నారు.